బాబు షాక్:అధికారులను రీకాల్ చేయాలి, శాఖలపై పట్టుపెంచుకోకపోతే అంతే
అధికారులను రీకాల్ చేసే వ్యవస్థ ఉంటే బాగుండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.ఐపీఎస్ అధికారిణి రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అనురాధ,
అమరావతి: అధికారులను రీకాల్ చేసే వ్యవస్థ ఉంటే బాగుండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.ఐపీఎస్ అధికారిణి రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అనురాధ, డిజిపి సాంబశివరావుపై కూడ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబునాయుడు వారిపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐఎఎస్,ఐపీఎస్ అధికారులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.అయితే అధికారులు చెప్పినట్టు వినకపోవడంతో బాబు తీవ్ర ఆగ్రహవేశాలను వ్యక్తం చేశారు.
గంటల తరబడి సమావేశాలను నిర్వహిస్తూ తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని బాధపడే పార్టీ నాయకులు, అధికారులపై బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇటీవల జరిగిన (గురువారం) మంత్రివర్గసమావేశంలో అధికారులతీరుపై బాబు తీవ్రంగా మండిపడ్డారు. డిజిపి , హోం శాఖ సెక్రటరీలపై బాబు మండిపడ్డారు. సీసీ కెమెరాల ఏర్పాటు అంశం కారణంగానే పోలీసు ఉన్నతాధికారులపై బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
బాబు ఆగ్రహనికి కారణమిదే
రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుచేసి పట్టణాలను నిఘా నీడలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత క్యాబినెట్ సమావేశంలోనే ఈ ప్రతిపాదననను తీసుకురావాలని సీఎం కోరారు. అయితే సాంకేతికపరమైన సమస్యలున్నాయని ఈ ఫైల్ ను తిప్పిపంపారు. అయితే గురువారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు బాబు.హోం సెక్రటరీ అనురాధ వద్ద ఈ ఫైల్ ఉంది. ఆమె నెలరోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఈ ఫైల్ ను లాక్ అండ్ కీలో బీరువాలో పెట్టుకొని వెళ్ళారని సీఎంకు అధికారులు చెప్పారు. దీంతో చంద్రబాబునాయుడు కేబినెట్ సమావేశంలోనే అధికారులపై మండిపడ్డారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులను రీకాల్ చేసే వ్యవస్థ అవసరం
అధికారులను రీకాల్ చేసే వ్యవస్థ ఉంటే బాగుంటుందని బాబు కేబినెట్ సమావేశంలోనే అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ అంటూ తాను పరుగులు తీస్తోంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అధికారులను తీరును తప్పుబట్టారు. పాఠశాలల రేషనలైజేషన్ విషయంలో కూడ సీఎం మంత్రులకు క్లాస్ తీసుకొన్నాడు. రేషనలైజేషన్ పేరిట నాలుగు వేల పాఠశాలలను మూసివేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకతను ఎందుకు గమనించలేదని ఆయన ప్రశ్నించారు. పదిమంది పిల్లలలోపున్న అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ప్రజలకు ఈ విషయాన్ని చెప్పి మానసికంగా సిద్దం చేయాలన్నారు.
మంత్రులకు శాఖలపై పట్టులేదు
కొందరు మంత్రులకు తమ శాఖలపై పట్టులేదని చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి ఉంటే తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. చంద్రబాబునాయుడు మంత్రులకు క్లాస్ తీసుకొన్నారు. తమ శాఖలపై మంత్రులు పట్టును పెంచుకోవాలని ఆయన సూచించారు.
విపక్షాలకు ఆయుధాలిస్తున్నారు
కొందరు అధికారులు, పార్టీకి చెందిన నాయకులు వ్యవహరిస్తున్న తీరు విపక్షాలకు ఆయుధాలిచ్చినట్టుగా ఉంటుందని చంద్రబాబునాయుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అందుకే అధికారులపై కూడ విరుచుకుపడ్డారు. సకాలంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ నాయకులు కూడ ఇటీవల కాలంలో పార్టీకి చెడ్డపేరు తీసుకురావడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.