టి నుండి లోకసభకి బాబు, సర్వే:జగన్కి ఛాన్సని భయం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం ఊపందుకుంటోంది. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైన పక్షంలోనే బాబు లోకసభకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. బాబు మల్కాజిగిరి లేదా హిందూపురం నుండి పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది.
ఇందుకోసం ఆయన ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు కూడా చేయిస్తున్నారట. చంద్రబాబు లోకసభకు వెళ్లడానికి వెళ్లేందుకు సిద్దం కావడానికి రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన 23వ తేది వరకు చర్చ జరుగుతుంది. ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని యూపిఏ భావిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని, అందుకే బాబు లోకసభ వైపు చూస్తున్నారంటున్నారు.
ఎన్డీయేలో కీరోల్ పోషించాలని భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు చంద్రబాబును కోరుతున్నారట. ఈ రెండు కారణాల వల్ల బాబు పార్లమెంటుకు వెళ్లాలని భావిస్తున్నారంటున్నారు. హిందూపురం టిడిపికి పెట్టని కోట. దీంతో అక్కడి నుండి పోటీ చేయాలని పలువురు నేతలు కోరుతున్నారట. విభజన తర్వాత తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలంగా ఉండాలంటే చంద్రబాబు ఈ ప్రాంతం నుండి పోటీ చేయడం మంచిదని టి టిడిపి నేతలు కోరుతున్నారని, అందుకే బాబు మల్కాజిగిరి వైపు కూడా మొగ్గుతున్నారంటున్నారు.
ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారట. మల్కాజిగిరి ప్రాంతంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువ మంది వచ్చి సెటిల్ అయినందు వల్ల దానిని బాబు ప్రిఫర్ చేస్తున్నారంటున్నారు. మరోవైపు చంద్రబాబు లోకసభకు వెళ్తారని ఇప్పటి నుండే ప్రచారం జరిగితే అది తమ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని మరికొందరు టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలవదనే ఉద్దేశ్యంతోనే బాబు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలకు విమర్శించే అవకాశమిచ్చినట్లవుతుందని, అది అంతిమంగా సీమాంధ్రలో జగన్కు లబ్ధి చేకూరుస్తుందని ఆందోళన చెందుతున్నారట. ఈ విషయాన్ని కొందరు బాబుకే నేరుగా చెబుతున్నారట. తాను అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతేనే ఆ దిశలో ఆలోచిస్తానని, ప్రస్తుతానికి కేవలం ఆలోచన మాత్రమేనని బాబు వారికి హామీ ఇస్తున్నారట.