అంతమాట అంటారా?: మోడీ ఆగ్రహంతో దిగొచ్చిన బాబు, నానికి హెచ్చరిక
భారతీయ జనతా పార్టీపై, ప్రధాని నరేంద్ర మోడీపై తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ లైన్ దాటితే బాగుండద
విజయవాడ: భారతీయ జనతా పార్టీపై, ప్రధాని నరేంద్ర మోడీపై తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ లైన్ దాటితే బాగుండదని హెచ్చరించారు.
చదవండి: జగన్తో భేటీ: టిడిపి తీరుపై పిఎం మోడీ సీరియస్?
వైసిపి అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వారు బీజేపీని, ప్రధాని మోడీని కూడా లాగారు. దీంతో బీజేపీ ఎదురు దాడి చేసింది. టిడిపి నేతల తీరుపై ప్రధాని మోడీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి.
చంద్రబాబు ఆగ్రహం
విషయం తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టిడిపి ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు.
కేశినేని నానిపై మండిపాటు
తనకు బీజేపీ వల్లే ఓట్లు తగ్గాయని, వచ్చేసారి ఆ పార్టీతో కలిసి పోటీ చేయకుంటే లక్షన్నర ఓట్లు సాధిస్తానని కేశినేని నాని వ్యాఖ్యానించారు. అలాగే రాజేంద్రప్రసాద్ కూడా ఓ నిందితుడిని ప్రధాని మోడీ తన పక్కన ఎలా కూర్చుండ బెట్టుకుంటారని, దీనిపై మోడీ, బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు
కేశినేని నాని, రాజేంద్ర ప్రసాద్ల వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. బీజేపీ మిత్రపక్షం అని, ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా లక్ష్య పెట్టకపోవడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
హెచ్చరిక
బీజేపీతో కేంద్రంలో, రాష్ట్రంలో కలిసి ఉన్నామనే విషయాన్ని గుర్తించాలని చంద్రబాబు అన్నారు. అది మరిస్తే ఎలాగని నేతలను ప్రశ్నించారు. నేతలు ఎవరు కూడా పార్టీ లైన్ దాటితే బాగుండదని హెచ్చరించారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని చంద్రబాబు అన్నారు.
ముందే చెప్పిన బీజేపీ
కాగా, ఈ విషయమై బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు అంతకుముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలకు తమ పార్టీని విమర్శించడం, ఆ తర్వాత చంద్రబాబు మందలించడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. వారు చెప్పినట్లే ఇప్పుడు చంద్రబాబు మందలించడం గమనార్హం.