జగన్తో భేటీ: టిడిపి తీరుపై పిఎం మోడీ సీరియస్?
జగన్కు తాను అపాయింట్మెంట్ ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మోడీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెప్పించుకున్నారని వినికిడి.
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనతో భేటీ జరపడంపై తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భేటీ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ప్రధాని కార్యాలయానికి చేరినట్లు సమాచారం.
జగన్మోహన్ రెడ్డికి తాను అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రధాని తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు పెద్ద నోట్ల రద్దుపై కూడా విమర్శలు చేశారని, ఇప్పుడు నేరుగా తప్పు పడుున్నారని, ఇది తెలుగుదేశం పార్టీతో తమ సంబంధాలపై ప్రతికూల ప్రభావం వేస్తుందని బిజెపి నేతలు అంటున్నారు.
తెలుగుదేశం చేస్తున్న అనవసరమైన వ్యాఖ్యల వల్ల ప్రజల్లో తమ పార్టీ ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉందని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
వైయస్ జగన్తో భేటీ...
చాలా కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న వైయస్ జగన్కు ప్రధాని మోడీ ఇటీవల అపాయింట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురి మధ్య భేటీ జరిగింది. రాష్ట్రంలోని సమస్యలపై తాను ప్రధానికి వినతిప్రం సమర్చించడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన ఫిర్యాదు కూడా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలనే సోనియా ఆలోచనను తప్పు పట్టారు.
రాజేంద్ర ప్రసాద్ ఇలా...
క్రిమినల్, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రతిపక్ష నేతకు ప్రధాని నరేంద్ర మోడీ ఎలా అపాయింట్మెంట్ ఇస్తారని తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఈ అపాయింట్మెంట్పై మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు కూడా ప్రధానిని తప్పు పట్టారు.
ప్రధానికి తెలిశాయి...
తాను జగన్తో భేటీ జరపడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమేమి వ్యాఖ్యలు చేశారనే వివరాలు ప్రధానికి పూర్తిగా చేరినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యలను పిఎంవో కార్యాలయం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలు తమ ఇరు పార్టీల సంబంధంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.
మోడీ ఆరా తీశారు...
తాను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అపాయింట్మెంట్పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవా, పార్టీపరమైనవా అనే విషయాన్ని మోడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయం మేరకే తెలుగుదేశం పార్టీ నాయకులు అటువంటి వ్యాఖ్యలు చేశారా అనే సమాచారాన్ని ఆయన ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదాన్ని పసిగట్టే...
ప్రమాదాన్ని పసిగట్టే తెలుగుదేశం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మోడీ భేటీపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించిన విషయం తెలిసిందే. జగన్పై మాత్రమే విమర్శలు చేయాలని, నరేంద్ర మోడీని గానీ బిజెపిని గానీ ఏమీ అనకూడదని ఆయన సూచించారు.