అది ఈడీ అంటే.. జగన్ తప్పించుకోలేరా?, నాడు లక్ష్మీనారాయణ పైనా
సిబిఐ, ఈడి వంటి విచారణాధికారులపై ఆరోపణలు చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాటేనని సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.
అమరావతి: సిబిఐ, ఈడి వంటి విచారణాధికారులపై ఆరోపణలు చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాటేనని సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.
గతంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపైనా ఇలాగే విమర్శలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించే నెపంతో సొంత పనులు చక్కబెట్టుకోవడం జగన్కు అలవాటే అన్నారు. జగన్ నైజం ఏనాడో బయటపడిందని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు అసహనం
తనను ఈడీ (ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్)లో ఇద్దరు అధికారులు వేధిస్తున్నారని, చంద్రబాబు ఒత్తిడితోనే వారు అలా చేస్తున్నారని ప్రధానమంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో జగన్ పేర్కొనడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జేడీ లక్ష్మీనారాయణ, జడ్జిలపై..
తన కేసుల్లో నిజాయితీగా దర్యాఫ్తు చేస్తున్న వారిపై ఒత్తిడి పెంచేందుకు జగన్ పనిగట్టుకొని వారిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గతంలో లక్ష్మీనారాయణపై ఆయన పత్రికలో బురద జల్లారన్నారు. తన కేసులను విచారిస్తున్న జడ్జిల పైన కూడా సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారన్నారు.
జగన్ ఈడీ నుంచి తప్పించుకోలేరు
ఈడీ కేసులు నమోదు చేశాక శిక్ష నుంచి తప్పంచుకోవడం అసాధ్యమని, అనేక మంది ప్రముఖులు శిక్షకు గురయ్యారన్నారు. జగన్ కూడా తాత్కాలిక ప్రయత్నాలు తప్ప అవినీతి కేసుల్లో శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు.
జగన్ కొత్త వాదన
ప్రధాని మోడీని ఎవరైనా వెళ్లి కలువవచ్చునని, కానీ ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని చెప్పి, ఇప్పుడేమో రాజీనామాలు చేస్తే తమ వాణిని ఎలా వినిపిస్తామని ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.హోదా డిమాండ్ ఎటు వెళ్లిందని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని ఎందుకు చెప్పారని నిలదీశారు.
దేన్నైనా తాకట్టు పెట్టగల సమర్థుడు
తన అవసరం కోసం జగన్ పార్టీ విధానాలు సహా దేనినైనా తాకట్టు పెట్టగల సమర్థుడని చంద్రబాబు అన్నారు. ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. తన అవసరం గడువుకోవడం ఒకటే ఆయనకు వచ్చిన విద్య అన్నారు. రేపు రాష్ట్రాన్ని కూడా ఇలాగే తాకట్టు పెట్టగలడన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.
కడప ఎన్నికల సమయంలో
కాగా, కడప ఉప ఎన్నికల సమయంలో పులివెందులకు, సోనియా గాంధీకి మధ్య పోరాటం అన్న జగన్, ఆ తర్వాత ఆమె కాళ్లు పట్టుకున్నారని, ఎంపీలతో రాజీనామా చేయిస్తానని, ఇప్పుడు ప్రధాని మోడీ ఎదుట మోకరిల్లారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జగన్ అవకాశవాది అన్నారు.