ప్రతిపక్షం బరితెగింపు, మనం దేశానికే ఆదర్శం: బాబు దిశానిర్దేశం
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పారదర్శక విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొని వివిద అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.
Recommended Video


తొలిసారి ఇలాంటి సభ..
‘పట్టణ ప్రాంతాల్లో పైసా ఖర్చుపెట్టకుండా ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 6లక్షల పంటకుంటలు తవ్వాం. సులభతర వాణిజ్యంలో మళ్లీ అగ్రస్థానంలో నిలుస్తాం' అని తెలిపారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి అడ్డుకునే 40మంది వైసీపీ సభ్యులే శాసనసభను బహిష్కరించారన్నారు. తొలిసారి ప్రతిపక్షం లేని సమావేశాలను జరుపాల్సి వచ్చిందని చెప్పారు.

ప్రతిపక్షం బరితెగింపు
‘ప్రతిపక్షం బరిగతెగించి పేద కూలీల పొట్టగొట్టేలా ఉపాధిహామీని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షం అసెంబ్లీకి వస్తే ఉపాధి హామీపై వాస్తవాలను సభలో పెట్టే వాళ్లం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షం అడ్డుపడుతూనే వచ్చింది. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. మంచిపనులు చేసి అందుబాటులో ఉంటే ప్రజలు ఆదరిస్తారు' అని సభ్యులకు వివరించారు.

సమర్థవంతంగా ఇంటింటికీ టీడీపీ
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రభుత్వానికి శ్రీరామరక్షని, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఆర్థికలోటు ఉన్న రాష్ట్రానికి ఆదాయం పెరగడానికి కొంత సమయం పడుతుందని, సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారని చంద్రబాబు కొనియాడారు. పరిష్కార వేదిక కాల్సెంటర్ బాగా పనిచేస్తోందని అన్నారు. ఉపాధి నిధులను సమర్థంగా వాడుకుంటున్నామని, ఉపాధి పనులతో ప్రజల కనీస అవసరాలు తీర్చుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామాల్లో 13వేల కి.మీ. సిమెంట్ రోడ్లు వేశామని చెప్పారు. రాష్ట్రంలో 5.50 లక్షల పంట కుంటలు తవ్వామని, రుణమాఫీని పారదర్శకంగా అమలు చేశామని, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశామని, పట్టణాల్లో ఎల్ఈడీ బల్బులను అమర్చామని చంద్రబాబు వెల్లడించారు.

రాజధాని మా బాధ్యత
ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని విపక్షం కేంద్రానికి ఫిర్యాదు చేసిందని, అయినా కేంద్రం వాస్తవాలు తెలుసుకొని నిధులు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నిధులు రావడంలో జాప్యం వల్ల కూలీలు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ విషయంలో అడుగడుగునా విపక్షం అడ్డుపడిందని చంద్రబాబు మండిపడ్డారు. ధైర్యం చేసి ముందుకెళ్లడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. బాధ్యతగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని బాబు స్పష్టం చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.

ఆ ఎమ్మెల్యేకు అభినందనలు
ఇంటింటికి టీడీపీలో బాగా పనిచేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే వీరాంజనేయులుకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు వీరాంజనేయులుతో కేక్ కట్ చేయించారు.

కేరళకు సీఎం చంద్రబాబు
ఎల్లుండి సీఎం చంద్రబాబు కేరళ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కొచ్చిన్లోని కన్వెన్షన్ సెంటర్ను సీఎం పరిశీలించనున్నారు. విశాఖలో నిర్మించబోయే అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన సూచనలు ఆయన చేయనున్నారు.

కీలకంగా కైజల యాప్
కైజల యాప్ వినియోగంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి లోకేష్ ప్రెజెంటేషన్ అందించారు. టీడీపీ నేతలందరూ కైజల యాప్ను ఉపయోగించాలని లోకేశ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కైజల యాప్ కీలకంగా పనిచేయనుందన్నారు. కైజల యాప్ వినియోగాన్ని సీరియస్గా తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కార్యకర్త నుండి, పార్టీ అధ్యక్షుడి వరకు ఒకేసారి సమాచారం పంపేందుకు కైజల యాప్ ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ వివరించారు.












Click it and Unblock the Notifications