చంద్రబాబు సంచలనం: సండ్రకు గ్రీన్ సిగ్నల్, పార్టీ మారిన సాయన్నపై ప్రతీకారం
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి కాల పరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
టీడీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్గా 19తో కూడిన పాలక మండలి గతేడాది మే 2న పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ 19 మందిలో తెలంగాణకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆరోజు చోటు కల్పించారు.
అందులో ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కాగా మరొకరు సికింద్రాబాదు పరిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా సాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సైకిల్ దిగి కారెక్కేశారు.
తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న సాయన్న పార్టీ మారడం చంద్రబాబును షాక్కు గురి చేసింది. అయితే ఆ నాడు తనకు తగిలిన షాక్కు ప్రతీకారంగా చంద్రబాబు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డులో చైర్మన్ చదలవాడతో పాటు మిగిలిన సభ్యులందరి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు సరేనన్న చంద్రబాబు సాయన్న పదవీ కాలాన్ని పొడిగించేందుకు మాత్రం ఆయన ససేమిరా అన్నారు.
దీంతో తెలంగాణ టీడీపీలోనే కొనసాగుతున్న సండ్ర వెంకటవీరయ్యను బోర్డులో కొనసాగించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, సాయన్నను బోర్డు నుంచి తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.