వారికా! నే భయపడేది?: ఉగ్రవాద పార్టీలతో జాగ్రత్తంటూ బాబు
గుంటూరు: కొందరు తప్పుడు పనులు, వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి చంద్రబాబునాయుడు అన్నారు. అటువంటి వారికి తాను భయపడే రకం కాదని మరోసారి తేల్చి చెప్పారు.
ఉగ్రవాద పార్టీలను నమ్మొద్దని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రాన్ని పాలించే హక్కు, ప్రజలను ఆదుకునే బాధ్యత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు. దాచేపల్లి మెయిన్ సెంటర్లో ఆదివారం జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబుపై విధంగా వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదం లాంటి పార్టీలను నమ్ముకుని ముందుకెళితే మునగడం ఖాయమని హెచ్చరించారు. వారితో జాగ్రత్తగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ప్రజలు, రైతులు, అన్ని వర్గాల మేలు కోరేది తమ ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.
ఆదుకుంటాం: బాబు భరోసా
గుంటూరు జిల్లాలో అధిక వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, సాయం అందించే పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెండ్రోజులుగా క్షేత్రస్థాయిలోపరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఆయన... జిల్లాలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు తాను జిల్లాలోనే పర్యటిస్తానని.. సోమవారం కూడా మరోసారి జిల్లాలోని వరద ప్రాంతాలకు వస్తానని చెప్పారు.
ఆదివారం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, గురజాల, రెంటచింతల ప్రాంతాల్లో పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు దాచేపల్లి మార్కెట్ యార్డుకు చేరుకున్న ఆయన దాచేపల్లితో పాటు గురజాల మండలంలోని గాడిదలవాగు, గండివాగు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తామని, అందుకు ఆయా జిల్లాల నుంచి 40 మంది డిప్యూటీ కలెక్టర్లు, 12 మంది ఐఏఎస్ అధికారులను జిల్లాకు రప్పించామని చంద్రబాబు వివరించారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి భారీ వర్షాలు, వరద సహాయక చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లోనూ, దాచేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సాయంపై పలు విషయాలు చెప్పారు.
సహాయ, పునరావాస చర్యల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కారం చేసి, ప్రశంసాపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. తమకు సాయమందలేదని బాధితుల నుంచి ఫిర్యాదులొస్తే బాధ్యులైన అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*హుద్హుద్ తుపానప్పుడు బాధితులకు ఇచ్చినట్లే ఇప్పుడు కూడా 20 కిలోల బియ్యం, లీటరు వంటనూనె, కిలో కందిపప్పు తదితర సరుకులను బాధితులకు తక్షణమే పంపిణీ చేయాలి. శాశ్వతంగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం అందించాలి. పత్తి, మిరప, ఇతర పంటలకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలి. రైతులకు బీమా వచ్చేలా చూడాలి. మిరపనారుకు 50 శాతం రాయితీ కింద రూ.2,500 అందించాలి. మళ్లీ పంటలు వేసే రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలి. మత్స్యకారులకు దెబ్బతిన్న వలలకు, పడవలకు పరిహారమివ్వాలి. కూలిన విద్యుత్తు స్తంభాలను రెండు రోజుల్లో నిలబెట్టాలి. మూడు రోజుల్లో రహదారులు, భవనాల శాఖ రోడ్లు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి. చెరువులకు పడిన గండ్లును మూడు రోజుల్లో పూడ్చాలి. రెండు రోజుల వ్యవధిలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి' అని ఆదేశించారు.












Click it and Unblock the Notifications