ట్రంప్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, 2004లో మీరే నన్ను ఓడించారు: ఉద్యోగులతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పైన ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పైన ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి దేశాన్ని ఎంత భ్రష్టుపట్టిస్తున్నదానికి ట్రంప్ మంచి ఉదాహరణ అన్నారు.
ఆదివారం నాడు విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణంలో చంద్రబాబు ఏపీ మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఒక వ్యక్తి దేశాన్ని ఎంత భ్రష్టుపట్టిస్తాడన్నదానికి డోనాల్డ్ ట్రంప్ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. అమెరికా గందరగోళంగా ఉందని, అతలాకుతలం అయిపోతుందని వ్యాఖ్యానించారు. ట్రంప్కు వ్యతిరేకంగా మన వాళ్లు పోరాడుతున్నారని చెప్పారు.

యువత మన సొంతం
మంచి నాయకుడు ఉంటే దేశం కానీ, రాష్ట్రం కానీ మంచి అభివృద్ధి చెందుతుందన్నారు. లేకపోతే దేశం, రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఉంటుందన్నారు. భారత దేశంలో ఎక్కడా లేనటువంటి యువత మన సొంతమన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతుందని, ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన తాను ఇప్పుడు పిల్లల్ని కనండని చెబుతున్నానని చంద్రబాబు అన్నారు.ప్రపంచంలో ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా అందించే శక్తి సామర్థ్యం ఒక్క భారత్కే ఉందని, వేరే దేశానికి లేదన్నారు.
కామన్సెన్స్తో రాణిస్తున్నారు
అలాంటి సర్వీసులు అందించాలంటే చదవు చాలా ముఖ్యమన్నారు. కామన్సెన్స్ అనేది భారతీయులకు ఎక్కువ ఉందని, అందుకే క్లాస్ రూంలో చదువుకోకపోయినా ప్రపంచంలో రాణించగలుతున్నారంటే కామన్సెన్స్, పట్టుదల కారణమన్నారు. అలాగే పిల్లలకు మంచి చదవు అందించగలిగితే ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా భారత్ నెంబర్ వన్ దేశం అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
కష్టాలు శాశ్వతం కాదు
ఏపీలో అన్ని వనరులు ఉన్నా చాలా ఇబ్బంది పడ్డామని, రూ.16వేల కోట్ల అప్పుతో రాష్ట్రం వచ్చిందని, అయితే కష్టాలు శాశ్వతం కాదని, కష్టాలను అధిగమించి ముందుకు వెళతామనే నమ్మకం తనకు ఉందన్నారు.
రెండున్నరేళ్లుగా ఒక వినూత్నమైన పద్ధతిలో ఏపీ అభివృద్దికి కృషి చేస్తున్నానని, సమస్యలు పరిష్కరించుకుంటున్నామన్నారు.
2004లో నాకు వ్యతిరేకంగా పని చేశారు
ఎన్ని సమస్యలు ఉన్నా ఉపాధ్యాయులకు ఏ లోటు చేయలేదన్నారు. టీచర్ అనేవాళ్లు ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. 2004లో నేను ఓడిపోతానని ఎవరూ ఊహించలేదన్నారు. మీలో కొందరు తనకు వ్యతిరేకంగా పని చేశారని చెప్పారు.
సమాజంలో తల్లీ, తండ్రీ తర్వాత గురువేనని, ఆ గురువు స్థానాన్ని కాపాడాలని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రపంచానికే ఎడ్యుకేషనల్ హబ్గా, నాలెడ్జ్ స్టేట్గా మారుతుందని, దేశంలోని టాప్ యూనివర్సిటీల్లో ఏడెనిమిది వర్శిటీలు ఏపీలో ఉన్నాయన్నారు.
పోలవరంపై..
రాష్ట్రానికి పోలవరం జీవనాడి వంటిదని చంద్రబాబు అన్నారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు. పోలవరం పూర్తైతే నీటి సమస్య తీరుతుందని, దాని కోసం నిరంతరం కష్టపడుతున్నామని సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications