నేరాలను ఇలా అదుపు చేశాం: ముగ్ధుడైన చంద్రబాబు, మెచ్చుకున్నారు
అమరావతి: కలెక్టర్ల సదస్సు రెండో రోజైన గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా సీసీటీవీల వినియోగంతో అనంతపురంలో నేరాలు ఎలా అదుపు చేసిందీ ఎస్పీ రాజశేఖర్బాబు వివరించారు. ఆయన చెప్పిన తీరుకు ముగ్ధుడైన చంద్రబాబు శభాష్ అంటూ కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీల ఏర్పాటుకు అవసరమైన నిధులు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల నుంచి చలాన్ల రూపంలో వసూలు చేసే డబ్బులో సగం తిరిగి ట్రాఫిక్, సివిల్ పోలీసులకు విధుల నిర్వహణలో కావాల్సిన అవసరాలకే కేటాయిస్తామని అన్నారు. రాష్ట్రంలో విజిబుల్ పోలీసింగ్ కంటే ఇన్విజిబుల్ పోలీసింగ్కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
రాయలసీమ ప్రాంతాల్లో ఫ్యాక్షనిజాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని పేర్కొన్న చంద్రబాబు, కేసులు వీగిపోకుండా గట్టి ఆధారాలతో కేసులు నమోదు చేయాలని సూచించారు. నేరాల్లో రాష్ట్రం ఆరోస్థానంలో ఉందని, దళిత, గిరిజనులపై 12 శాతం దాడులు జరగడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ డా.కాటమనేని భాస్కర్ పౌర సేవలపై ప్రత్యేకంగా రూపొందించిన యాప్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఆన్లైన్ ద్వారా ప్రజలకు వెసులుబాటు
జిల్లాలో పంచాయతీల్లో ఇళ్లపన్ను, పంపు పన్ను వసూలుతోపాటు ప్రజలకు ఆదాయ, నివాస, కుల, జనన మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ రకాల పౌర సేవలను ఆన్లైన్ ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుండే నేరుగా పొందే వెసులుబాటును కల్పించామని, దీనివల్ల జిల్లాలో మంచి ఫలితాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ మీ సేవా కేంద్రానికి వెళ్లకుండానే ఆధార్ను ఆధారం చేసుకుని పౌరులకు కావలసిన వివిధ ధ్రువపత్రాలను పొందే విధానం బాగుందని, దీన్ని అన్ని జిల్లాల్లో నెల రోజుల్లో అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.

ఘనంగా సత్కరిస్తానని చంద్రబాబు ప్రకటన
ప్రభుత్వం లక్ష్యసాధన దిశలో భాగంగా కలెక్టర్లు ఇస్తున్న హామీలను ఖచ్చితంగా కార్యాచరణలో చూపగలిగితే ఇదే సమావేశాల్లో ఘనంగా సత్కరిస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతి కలెక్టర్ కూడా తన ఆలోచనను ఏవిధంగా కార్యాచరణలోకి తీసుకువస్తుందీ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు.

ఆనందం వ్యక్తం చేసిన చంద్రబాబు
కడప జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ ‘గత ఏడాది 8.4 వృద్ధిరేటు వుండగా ఈ ఏడాది 23 శాతం సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పుడు సిఎం ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయకుమార్ వ్యవసాయ రంగంలో సాధిస్తున్న గణనీయమైన ప్రగతిని వివరించారు.

వేరుశనగ పంట ద్వారా రూ. 250 కోట్ల ఆదాయం
ప్రధానంగా అనంతపురం జిల్లాలో సకాలంలో వేరుశనగ పంటను రక్షించటం ద్వారా రూ.250 కోట్లు ఆదాయం రాబోతున్నదని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో నవధాన్యం పంటలపై దృష్టి పెట్టాలంటూ ఆయన చేసిన సూచనను సిఎం అభినందించారు. శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న విజయకుమార్ను చంద్రబాబు అభినందిస్తూ అదే సమావేశంలోనే ఆయన్ను వ్యవసాయ శాఖ రాష్ట్ర సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications