ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ, బీటెక్ రవితో కలిసి సీఎం రమేష్ ఆమరణ దీక్ష
అమరావతి/కడప: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఈ మేరకు లేఖలో కోరారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుగుణంగా సుప్రీం కోర్టులో రివైజ్డ్ అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విజయసాయిరెడ్డితో మొదలు!: అందివచ్చిన అవకాశం, చంద్రబాబుకు జగన్ దెబ్బకు దెబ్బ
మెకాన్ సంస్థ తాజా నివేదికను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్తో పాటు నవ్యాంధ్ర రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అన్నింటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్టీల్ ప్లాంట్ కోసం దీక్షకు దిగారు.
ప్రాణత్యాగానికైనా సిద్ధం
స్టీల్ ప్లాంట్ సాధించేందుకు తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని దీక్ష ప్రారంభం సందర్భంగా సీఎం రమేష్ అన్నారు. ఈ పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని మండిపడ్డారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా తాను ఈ రోజు (బుధవారం) ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానన్నారు.
యువత కోసం ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాటం
ప్రజల మద్దతుతో జిల్లా యువత కోసం ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. కడప జిల్లాకే చెందిన వైసీపీ అధినేత వైయస్ జగన్ కేంద్రం అన్యాయం చేస్తున్నప్పటికీ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. మెకాన్ సంస్థ ఇచ్చిన ముసాయిదా నివేదికను కేంద్రం ఎందుకు పక్కన పెట్టిందని ప్రశ్నించారు. కేంద్రమే స్వయంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా ప్రజలను మభ్య పెట్టేందుకు ఏపీ బీజేపీ నేతలు మోసం చేస్తున్నారన్నారు.
భారీ కాన్వాయ్తో వచ్చి
ఉదయం తన స్వగ్రామమైన పోట్లదుర్తిలో తల్లిదండ్రుల విగ్రహాలకు సీఎం రమేష్ పూలమాల వేశారు. అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ కాన్వాయ్తో కడపకు వచ్చారు. కడపలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేశారు. జడ్పీ ఆవరణలోని దీక్షా శిబిరానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం సీఎం రమేష్, బీటెక్ రవి ఆమరణ నిరాహర దీక్ష ప్రారంభించారు.
దీక్షకు విశేష స్పందన
ఆయన దీక్షకు విశేష స్పందన లభిస్తోంది. పలువురు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పులివెందులలో జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో తాను కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటన చేసారు.బుధవారం కడప జెడ్పీ కార్యాలయం ఆవరణలో దీక్షకు దిగారు. సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్షలో కూర్చున్నారు.