ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ: వీటిపైనే ప్రధాన చర్చ
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం గంటకుపైగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి సహా పలు కీలక అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడం, ఆర్థిక లోటును భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వ సహాకారాన్ని కోరారు.
అంతేగాక, గత ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని చంద్రబాబుప్రధాని మోడీకి వివరించినట్లు తెలిసింది. మరోవైపు, గత బడ్జెట్లో కేటాయించిన అంశాలను పూర్తి చేయడంతోపాటు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మరింత సాయం చేయాలని అడిగినట్లు సమాచారం.

ప్రధాని మోడీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షాతో సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయిన చంద్రబాబు.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపులపై ఆర్థిక మంత్రి నిర్మలతో చర్చించినట్లు తెలిసింది.
బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా చూడటంతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి రైల్వే జోన్ తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైల్వే పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిసింది.
N Chandrababu Naidu, Chief Minister of Andhra Pradesh met Prime Minister Narendra Modi, in Delhi today
— ANI (@ANI) December 25, 2024
(Source: TDP) pic.twitter.com/sWYgfRfYGP
ఇది ఇలావుంటే, బుధవారం మధ్యాహ్నం జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలతోపాటు పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఆ తర్వాత అమిత్ షా తోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో 15 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేటి ఉదయం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications