చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్లు కాక ఇంకేమొస్తాయ్!, 25సార్లు సమన్లు..: బాబ్లీ కేసుపై అమిత్ షా
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు బాబ్లీ కేసులో కోర్టు నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత దీనికి బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ టీడీపీ నేతలు విమర్శలు చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ స్పందించారు.
బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన సందర్భంగా తనపై కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అంటకాగుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో అమిత్ షా శనివారం మీడియాతో మాట్లాడారు. 2010లో మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే చంద్రబాబుపై కేసు పెట్టిందని అమిత్ షా గుర్తు చేశారు. 2013లో పోలీసులు ధర్మాబాద్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారన్నారు.

కోర్టు 25 సార్లకు పైగా సమన్లు జారీచేశాక కూడా వెళ్లకుంటే నాన్ బెయిలబుల్ వారంట్ కాకుండా ఇంకేం వస్తుందని చంద్రబాబుపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేవలం ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
కేసు పెట్టిన వాళ్లతోనే చంద్రబాబు ప్రస్తుతం అంటకాగుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు నమ్మేయడానికి తెలుగు ప్రజలు అంత అమాయకులేమీ కాదని అమిత్ షా అన్నారు. చంద్రబాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడానికీ, బీజేపీకి సంబంధం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించేందుకు అమిత్ శనివారం హైదరాబాద్ వచ్చారు. మహబూబ్నగర్ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications