కాపుల రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
కాపులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
విజయవాడ: కాపులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తాను సామాజిక న్యాయం అనేది విద్యార్థి దశలోనే నేర్చుకున్నానని, యూనివర్శిటీలోనే దానికోసం పోరాడానని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే కాపుల రిజర్వేషన్లను తొలగించారని చెప్పారు. కాపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు అప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తాను చేసిన పాదయాత్రలో అనేక వర్గాల సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు.
గుర్తు చేయాల్సిన అవసరం లేదు..
సమాజంలో తాము వెనుకబడ్డామన్న కాపుల ఆవేదనను గుర్తించానని చంద్రబాబు చెప్పారు. అందుకే అన్ని వర్గాలతో సమానంగా కాపులను అభివృద్ధి చేసేందుకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించానని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సమాజం కోసం ఏదైనా చేస్తేనే ప్రజల్లో విశ్వసనీయత వస్తుందని, తాను ఇచ్చిన హామీలను ఎవరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదని, తన బాధ్యతలను తానే పూర్తిచేస్తానని తెలిపారు.
Recommended Video
అందుకే అమరావతికి..
పేదలు ఏ సామాజికవర్గంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినా మన రాష్ట్రం నుంచే పాలన కొనసాగించాలన్న ఉద్దేశంతోనే అమరావతికి వచ్చేశామని వివరించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని తెలిపారు.
రెచ్చగొడుతున్నారు..
సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. కొందరు బీసీలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలాంటి వారి మాటలను నమ్మొదని సూచించారు.
రిజర్వేషన్లు త్వరలోనే..
కాపుల రిజర్వేషన్ల అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఎందుకు ప్రస్తావించలేదని చంద్రబాబు నిలదీశారు. కాపులు ఆర్థిక, ఉద్యోగ, విద్యా పరంగా వృద్ధి చెందేందుకు ఎంత చేయాలో.. అంతా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీలతో సమానంగా రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. అదే సమయంలో మిగితా వర్గాలకు అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. వీలైనంతా తొందర్లోనే రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.