ఒంగోలు పాలు తాగండి: మండలిలో చంద్రబాబు చిరునవ్వులు
అమరావతి: మూడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాసన మండలిలో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గురించి మాట్లాడిన నేపథ్యంలో ఒంగోలు ఆవుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒంగోలులో లభించే పాలు దేశంలో మరెక్కడా దొరకవని చెప్పారు. మీరంతా తాగారో లేదో తెలియదు.. తాగకపోతే ఇప్పుడు తాగండి అని శాసనమండలి సభ్యులకు, మండలి ఛైర్మన్కు సూచించారు. ఒంగోలు పాలను ప్రమోట్ చేస్తున్నా.. ఒకసారి టేస్ట్ చేసి చూడండంటూ చంద్రబాబు చిరునవ్వు నవ్వారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ క్రీడలు పెట్టినప్పుడు ఒంగోలు బుల్ పెట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలో ఉండే ఫెర్టిలిటి, నీళ్లు, భూమి వీటి ప్రభావంగానే ఒంగోలు ఆవులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఒంగోలు ఆవులను మనం మరిచిపోయాం గానీ, ఈ ఆవులను బ్రెజిల్ వారు బ్రెస్ట్ బ్రీడ్గా తయారు చేస్తున్నారన్నారు.

నాకే ఆశ్చర్యమేసింది
ఇటీవల ఓ కార్యక్రమంలో బ్రెజిల్ ప్రతినిధులను కలిసినప్పుడు వారిచ్చిన ప్రజెంటేషన్ నాకే ఆశ్చర్యమేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మన రాష్ట్రం నుంచి తీసుకెళ్లిన ఒంగోలు బ్రీడ్ నుంచి ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఫార్మ్స్ పెట్టారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ ఫార్మ్స్ను తప్పకుండా విజిట్ చేయాలనుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
వారసత్వ సంపదను మరిచిపోయాం
మనం మరిచిపోయిన వారసత్వ సంపదను వారు తీసుకెళ్ళి మరీ చాలా అందంగా తయారు చేశారని చెప్పుకొచ్చారు. ఎవరికీ హోదా ఇచ్చే పరిస్థితిలో లేమని కేంద్రం అంటోందని అన్నారు. హోదా వచ్చేంత వరకూ పోలవరం ఆపుకుంటామా? అని ఆయన ప్రశ్నించారు.
60 వేల కోట్లు వస్తుందని జైరాం రమేశ్ అంటున్నారు
ప్రత్యేకహోదా వస్తే ఏమొస్తుందని, నాకు గైడ్ చేయండని విపక్ష నేతలకు చంద్రబాబు సూచించారు. సంవత్సరానికి 60 వేల కోట్లు వస్తుందని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జైరాం రమేష్ చెబుతున్నారని, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని, నన్ను ఎడ్యుకేట్ చేయాలని కోరారు. నాకు తెలిసి ఏపీకి సుమారు రూ. 20 వేల కోట్లు రావచ్చని అన్నారు.
హైదరాబాద్లో మాకు ఇవే చివరి సమావేశాలు
హైదరాబాద్లో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహించడం ఇవే చివరి సమావేశాలని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే సమావేశాలు ఏపీలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో నాపై చాలా విమర్శలు చేశారని అన్నారు. తెలుగువారికి మంచి రాజధాని ఉండాలనే హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications