సీఎం కెసిఆర్, ప్రధాని మోడీ కులంతోనే గెలిచారా: జగన్పై చంద్రబాబు
విజయవాడ: దేశంలో కులాల వల్ల ఎప్పుడూ ఓట్లు రాలవని, అలా వస్తాయనుకుంటే కెసిఆర్, మమతా బెనర్జీ ముఖ్యమంత్రులు కాగలరా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యవారా? అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు.
దేశంలో కులాల వల్ల ఎప్పుడూ ఓట్లు రావని, అలా వస్తాయనుకుంటే చాలామంది ముఖ్యమంత్రులు కాకపోయేవారని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలరా అని అన్నారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం అనంతరం ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
కులసంఘాల నాయకులే ఓడిపోయిన ఘటనలున్నాయన్నారు. ఓ సామాజిక వర్గ నాయకుడు పోటీ చేసిన ప్రతిసారి ఎన్ని ఓట్లు వచ్చాయో చూశామని, అలాగే మరో కుల సంఘాల నాయకుడు గెలిచినా మెజార్టీ బాగా పడిపోయిందన్నారు.
తుని విధ్వంసంలో పలువురి కెమెరాలు ధ్వంసమయ్యాయని వారికి సాయం అందించాలని మీడియా ప్రతినిధులు చంద్రబాబును కోరగా.. నకారాత్మకమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, సకారాత్మక అంశాలకు పెద్దపీట వేయాలని మీడియాకు సూచించారు. సహాయంపై పరిశీలిస్తామని చెప్పారు. కాగా, ముద్రగడ దీక్ష విరమించిన నేపథ్యంలో చంద్రబాబుకు ఊరట అని చెప్పవచ్చు.