అసలేం జరిగింది?: అమలాపురం ఘటనపై చంద్రబాబు సీరియస్
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో దళితులపై దాడి జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమలాపురం ఘటనకు సంబంధించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ సాంబశివరావు బుధవారం నివేదిక అందజేశారు.

ఈ నివేదికను పరిశీలించిన సీఎం చంద్రబాబు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. దళితులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటివారినైనా విడిచిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. ఈ దాడి ఘటనలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం తరుపున ఉచితంగా వైద్యసాయం అందిస్తామని ఆయన తెలిపారు.
అమలాపురం ఘటన: అసలేం జరిగింది?
అమలాపురంలోని జానకిపేటకు చెందిన మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, లాజర్ చనిపోయిన పశువుల చర్మాలను వలిచి చర్మకార పనికి వినియోగించుకుంటూ ఉంటారు. అమలాపురం కూరగాయల రైతు బూరగాలయ అరవింద్కు చెందిన ఆవు మేత మేస్తోన్న క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఆ ఆవు చనిపోయింది.
చనిపోయిన ఆవుని తీసుకెళ్లాల్సిందిగా అరవింద్ కోరాడు. దీంతో అరవింద్ విజ్ఞప్తి మేరకు రాత్రి 9.30 గంటల సమయంలో ఎలీషా, లాజర్ చనిపోయిన ఆవును మినీ వ్యాన్లో పెట్టుకుని సూదాపాలెం శ్మశానానికి వెళ్లారు. రాత్రి 10.30 సమయంలో కత్తులతో ఆవు చర్మాన్ని తొలగిస్తుండగా కామనగరువుకు చెందిన కొందరు రైతులు అక్కడికి వచ్చారు.
తమకు చెందిన మూడు ఆవులు కన్పించకుండా పోవడంతో వాటి కోసం గాలిస్తున్న వారికి.. ఆవు చర్మం వలుస్తున్న ఎలీషా, లాజర్ కన్పించారు. వెంటనే వారిద్దరితో పాటు అయినవిల్లి మండలం పోతుకుర్రుకు చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ లక్ష్మణకుమార్పై రైతులు మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు.
అనంతరం వారిద్దరినీ ఓ కొబ్బరి చెట్టుకు కొట్టేసి, బట్టలిప్పి తీవ్రంగా కొట్టారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు వెంకటేశ్వరరావు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయూనికి దాడి చేసిన వారంతా పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దళితులను పోలీసులు అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా, ఎలీషా, లాజర్ ఆవులను దొంగిలించలేదని, చనిపోయిన ఆవు చర్మం వలుస్తున్నట్టు గోరక్షక దళ సభ్యులు విచక్షణా రహితంగా వారిపై దాడి చేశారని పోలీసుల దర్యాప్తులో తేలిందని అమలాపురం డీఎస్పీ అంకయ్య మంగళవారం మీడియాకు వివరించారు. దీంతో ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో పెను కలకలం రేపింది.












Click it and Unblock the Notifications