సొంతగా మార్కులు: వెనుకబడ్డ బాబు, చిత్తూరులో ఐదో ర్యాంక్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు! కొద్ది రోజుల క్రితం పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ర్యాంకులలో చంద్రబాబుకు 79వ ర్యాంకు వచ్చింది. తాజాగా, చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు జిల్లాలో 5వ ర్యాంకు వచ్చిందని తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం శాఖాపరంగా పనితీరు, ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రులుగా పని చేస్తున్న తీరుకు సంబంధించి... మంత్రులకు రెండు కేటగిరీల్లో ర్యాంకులిచ్చారు. ఈ విషయంపై ఆ రోజు పెద్ద చర్చ జరిగింది. నాడు మంత్రుల్లో పీతల సుజాత ఫస్ట్ రాగా, మంత్రి నారాయణ చివరి స్థానంలో నిలిచారు.
ఎమ్మెల్యేల విషయానికి వస్తే చంద్రబాబుకు 79వ ర్యాంకు వచ్చింది. ఎమ్మెల్యేల పని తీరును బట్టి రాష్ట్ర స్థాయి, జిల్లాల వారీగా కూడా చంద్రబాబు ర్యాంకులు ఇస్తున్నారు. ఈ ర్యాంకుల్లో చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ర్యాంకు అంత బాగా ఏమీ లేదు.

ఈ మేరకు తనకు తానే ఇచ్చుకున్న ర్యాంకుల్లో చంద్రబాబు... పని తీరులో తాను వెనుకబడ్డానని చెప్పకనే చెప్పారు. ర్యాంకుల విషయంలో రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో 79వ స్థానంలో నిలిచిన చంద్రబాబు, సొంత జిల్లా ర్యాంకుల్లో మాత్రం ఐదో ర్యాంకులో ఉన్నారు.
ర్యాంకుల్లో ఐదో స్థానంలో నిలిచినా 64 శాతం మార్కులతో చంద్రబాబు ఫస్ట్ గ్రేడ్లోనే నిలిచారు. ఇక చిత్తూరు జిల్లా ర్యాంకుల విషయానికి వస్తే.. కొత్తగా సభలో అడుగుపెట్టిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ అందరినీ వెనక్కు నెట్టేసి మొదటి స్థానంలో నిలిచారు. సీనియర్ ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగానూ కొనసాగుతున్న బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి(శ్రీకాళహస్తి) రెండో స్థానంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications