హ్యాక్ చేసినా తెల్సు, సెల్ఫోన్లో నేనే కీలకం: నోట్లరద్దుపై మళ్లీ బాబు ఆసక్తికరం
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని తానే లేఖ రాశానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.
విజయవాడ: రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని తానే లేఖ రాశానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. నోట్ల రద్దు అంశంపై చంద్రబాబు పలు సందర్భాల్లో పలు విధాలుగా మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి.
నోట్ల రద్దును తొలుత ఆయన స్వాగతించారు. ఆ తర్వాత ప్రజల ఇబ్బందులను గమనించి, ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సమయంలో బ్యాంకర్ల పైన మండిపడ్డారు. అయితే, నోట్ల రద్దు తన వల్లే అని చెప్పుకున్న చంద్రబాబు ప్రజలు ఇబ్బంది పడటాన్ని చూసి యూ టర్న్ తీసుకున్నారని వైసిపి ఆరోపించింది.
ఇప్పుడు ఆయన తాను లేఖ రాశానని చెప్పారు. అదేవిధంగా కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రకటించిన వెంటనే ఆ నిర్ణయాన్ని స్వాగతించిన మొదటి వ్యక్తిని తానేనని చెప్పారు. సోమవారం డీజీ ధన్ మేళాను నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జవాబుదారీతనం రావాలంటే బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరగాలన్నారు. కొందరు నిరంతరం కష్టపడుతుంటే మరికొందరు ప్రజల సంపదను దోచుకుంటున్నారన్నారు.

అవినీతితో ఓట్లేసే నేతలు సేవ చేస్తారా
ప్రస్తుతం అవినీతితో ఎదిగిన నేతలకు ఓట్లేసే పరిస్థితి వచ్చిందని, డబ్బు పంచి గెలిచినవారు ఏం ప్రజా సేవ చేస్తారని వైసిపిని, ఆ పార్టీ అధినేత జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అవినీతి రాజకీయాలు చేసే నేతలు గెలిస్తే అధికారులు కూడా కలుషితమవుతారన్నారు. అప్పుడు సమాజం కలుషితం అవుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు ఎన్నో జరిగాయని ఆరోపించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొందరు వేలకోట్లు దోచుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తోందన్నారు.
నోట్ల రద్దు తరువాత రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు 34 శాతానికి పెరిగిందన్నారు. డిజిటల్ లావాదేవీల్లో కృష్ణా జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రెండు నెలలు కష్టపడ్డామని, ఇప్పుడు కరెన్సీ కొరత లేదన్నారు. నోట్లు రద్దు చేయాలని మొదట చెప్పింది తానే అని, నోట్ల రద్దును సమర్థించిన తొలి ప్రభుత్వం కూడా తమదే అన్నారు.
హ్యాక్ చేసినా నాకు తెలుసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ సర్వర్ను ఎవరూ హ్యాక్ చేయలేరని, ఎవరైనా హ్యాక్ చేసినా ఎలా పరిష్కరించాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు.
సెల్ ఫోన్లో కీలక పాత్ర నాదే
వాజపేయి హయాంలో సెల్ ఫోన్లను తీసుకు వచ్చామని, అందులో తనది కీలకమైన పాత్ర అని చంద్రబాబు నాయుడు అన్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే డబ్బుతో పని లేదన్నారు. 20 శాతం నగదు, మిగతా డిజిటల్, మొబైల్ ద్వారా లావాదేవీలు జరపాలన్నారు.












Click it and Unblock the Notifications