మోడీ వార్నింగ్ ఇచ్చారు, అందుకే రేపు రాహుల్ గాంధీని కలుస్తున్నా: చంద్రబాబు ఊహించని ప్రకటన!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఊహించని ప్రకటన చేశారు! టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల పైన. అలాంటి పార్టీ ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తోంది. తాజాగా అమరావతిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తాను ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలవనున్నట్లు ప్రకటించారు.
'కాంగ్రెస్తోను కలిసేందుకు సిద్ధం': 2019లో ఏపీలో పొత్తుకు టీడీపీ పచ్చజెండా!
బీజేపీయేతర నేతలను జాతీయస్థాయిలో ఏకం చేసేందుకు మాయావతి, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులను కలిశానని, దేవేగౌడ, ఫరూక్ అబ్దుల్లా తదితరులతో మాట్లాడుతున్నానని చెప్పారు. రేపు (గురువారం) ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని తాను కలుస్తున్నట్లు చెప్పారు. అందరం కలిసి ఏకతాటి పైకి రావాలని తాను రాహుల్ గాంధీకి చెబుతానని అన్నారు.
నరేంద్ర మోడీపై నిప్పులు
ఈ సమావేశంలో చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటి పైకి తెస్తానని చెప్పారు. గుజరాత్ నుంచి అవినీతి అధికారులను తీసుకు వచ్చి సీబీఐ వ్యవస్థను దిగజార్చారని ఆరోపించారు. కేంద్రం తప్పుడు విధానాల వల్ల సీబీఐ పరువు పోయిందని ఆరోపించారు. ఏపీ ఐటీ అధికారులు దాడులు చేయబోమని చెప్పడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అధికారులను పంపుతున్నారని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో అడ్డగోలుగా ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు.
నాపై ఐటీ దాడులు జరిగితే అధైర్యపడొద్దు
రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశం కోసం అన్ని జాతీయ పార్టీల నాయకులను కలుపుకుపోవడానికి సిద్ధమయ్యామని చంద్రబాబు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం టీడీపీకి మొదటి నుంచి అలవాటేనని చెప్పారు. ఇప్పటి వరకు మన ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయని, రేపు నాపైనా జరగవచ్చునని చెప్పారు. ఎవర అధైర్యపడవద్దని చెప్పారు. పోరాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
మోడీ వార్నింగ్ ఇచ్చారు, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర
దుర్మార్గులపై పోరాడటానికి అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పారు. టీడీపీ అనుకుంటే ప్రపంచంలో అడ్డుకునే శక్తి ఏదీ లేదన్నారు. కేంద్ర విధానాలను తప్పుబడితే మోడీ, అమిత్ షాలు బాధపడుతున్నారని చెప్పారు. తనకు కార్యకర్తలు అండగా ఉండాలని చెప్పారు. మన అవిశ్వాసం పెడితే పార్లమెంటు సాక్షిగా సన్మానం చేస్తామని ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. (అవిశ్వాసం పెడితే వీగిపోతుందనే ఉద్దేశ్యంలో మోడీ అన్నారు) కానీ ఈ ఐటీ దాడులు అదేనేమో అన్నారు. టీడీపీ ఎన్నోసార్లు దేశానికి దిశ, దశ చూపించిందని, ఇప్పుడు మరోసారి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవలసిన సమయం వచ్చిందని చెప్పారు.
యూపీ ఏన్నికల కోసమే నాడు నోట్ల రద్దు
కేంద్రంతో విబేధిస్తే ఐటీ దాడులు చేపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. నాడు రూలింగ్ చేసిన పార్టీలు (యూపీఏ తదితర పార్టీలు) ఇలాగే ఐటీ దాడులు చేస్తే మీరు బయట తిరిగేవారా అని మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. మోడీని ప్రజలు నమ్మితే మీరు ఇచ్చే బహుమతి ఇదా అన్నారు. ఓ వైపు ఐటీ దాడులు, ఈడీ విచారణలు, సీబీఐలు ఏమిటిది అని ప్రశ్నించారు. మీరు నీతిగా, నిజాయితీగా పని చేస్తే టీడీపీ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కానీ భయబ్రాంతులకు గురి చేస్తే భయపడిపోతామని అనుకోవడం మీ భ్రమ అన్నారు. నోట్ల రద్దుతో ఒరిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల కోసమే నాడు నోట్ల రద్దు చేశారన్నారు. బ్యాంకులో డబ్బు ఉంచుకోవడానికి ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. బ్యాంకు దివాళా తీస్తే జనం డబ్బును ఈక్విటీగా మార్చేందుకు చట్టం చేస్తామని చెబుతున్నారన్నారు.
హోదాను తుంగలో తొక్కారు
బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. రెండంకెల వృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు. మనలను అణగదొక్కాలని చూస్తున్నా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. బీజేపీ విధానం వల్ల దేశం ప్రమాదంలో పడిందన్నారు. నాడు విభజన సమయంలో కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టి మోడీ ఆదుకుంటారని భావించామని అన్నారు. కానీ ముంచారన్నారు.