అంతా మేమే చేశాం, కెసిఆర్ వసూళ్లే: చంద్రబాబు
హైదరాబాద్: కాంగ్రెసు అవినీతికి వ్యతిరేకంగా, మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తమ పార్టీ ఒక్కటేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. పార్టీ సీమాంధ్ర నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సోమవారం ప్రసంగించారు. దేశాన్ని బాగు చేసే స్థితిలో కాంగ్రెసు లేదని, కాంగ్రెసు అవినీతి కుంభకోణాలతో, అసమర్థ పాలనతో అప్రతిష్ట పాలైందని ఆయన అన్నారు.
తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, దీనివల్ల సంపద పెరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేయాలని గానీ తెలంగాణను అభివృద్ధి చేయాలని గానీ కాంగ్రెసుకు ఆలోచన వచ్చిందా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, ప్రజల ఆస్తులు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. కుంభకోణాలపై తాము రాజీ లేని పోరాటం చేశామని, మైనింగ్ మాఫియాపై పోరాటం చేశామని, ఈ పోరాటాలు చేసిన ఏకైక పార్టీ తమదేనని ఆయన చెప్పుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని సమస్యలకు కాంగ్రెసు కారణమని ఆయన విమర్సించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెసు అపహాస్యం చేసిందని, దేశాన్ని బాగు చేసే ఆలోచన కాంగ్రెసుకు లేదని, తమ పార్టీని దెబ్బ తీయాలని తెలుగుజాతి మధ్య విద్వేషాలు పెంచిందని చంద్రబాబు అన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు మారారని, అయినా ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. మరో ముఖ్యమంత్రిని తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, పరిపాలన చేయలేని అసమర్థతతో కాంగ్రెసు కొట్టుమిట్టాడుతోందని ఆయన అన్నారు.
కాంగ్రెసు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, అనిశ్చిత పరిస్థితి కల్పించారని, కాంగ్రెసు పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిందని ఆయన అన్నారు. ఇద్దరు అన్నదమ్ములుంటే నచ్చజెప్పి సమాన న్యాయం చేస్తారని, కానీ కాంగ్రెసు రాష్ట్ర విభజన విషయంలో అలా చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసు కలుపుకుంటుందని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలుగుజాతి కలిసి ఉండాలని, విడదీసే శక్తి ఎవరికీ లేదని, టిడిపి తెలుగువారిని కలిపి ఉంచుతుందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసులో కలిసి పోయేలా వ్యూహం రచించుకున్నారని ఆయన అన్నారు. నీచ రాజకీయాలు చేసి, పార్టీని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా భూస్థాపితం చేసుకుందని ఆయన అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు భూస్థాపితమైందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటో తాము తేల్చేస్తామని ఆయన అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతానంటున్నారని, ఏం చేశారని పార్టీ పెడుతారని ఆయన అడిగారు. ఇంట్లో కూర్చుని డబ్బులు వచ్చే ఫైళ్లపై సంతకాలు చేశారని ఆయన అన్నారు. వైయస్సా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బలహీనపడుతున్నారని కాంగ్రెసు కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. కెసిఆర్, జగన్, కిరణ్ సోనియాపై ఏమీ మాట్లాడడం లేదని, వారు ముగ్గురు కుట్రలు చేసి తమ పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీని దెబ్బ తీయలేరని ఆయన అన్నారు. కెసిఆర్ హైదరాబాదులో వసూళ్లు చేశారు తప్ప అభివృద్ధికి పాటుపడలేదని ఆయన అన్నారు.