జగన్కు ఇంత దురద ఎందుకు, అది సరైందేనా, మోడీకి ఫోన్ చేశా: బాబు
అమరావతి: ప్రాజెక్టులు, రాజధానిని అడ్డుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఆరోపించారు. కారణాలు లేకుండా ప్రవర్తించే దుర్మార్గుల్లా విపక్ష నేతల తీరు ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఇంత దురద అని నిలదీశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ ఛాలెంజ్ విధానం పైన ఏలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పిటిషన్ వేశారని, టెండర్ వేయకుండానే కోర్టుకు వెళ్లడం సరైందేనా అని ప్రశ్నించారు.
ప్రధానికి ఫోన్ చేసా
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వంద శాతం నిధులు ఇస్తామన్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపానని చంద్రబాబు అన్నారు. హోదా వస్తే ఏ ప్రయోజనాలు సమకూరుతాయో అంతే సమానమైన ప్రయోజనాలు ఇస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారన్నారు.
హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ కింద అయిదేళ్ల పాటు నిధులు ఇస్తామని చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి అయ్యే మొత్తం ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుందని ప్రధాని మోడీ చెప్పారన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పైన ప్రతి సోమవారం సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. నీటి సమస్యతో ప్రజలలో అభద్రతా భావం రాకూడదన్నారు. అభద్రతా భావం ఏర్పడితే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఘటనలే ఉదాహరణ అన్నారు.