టీటీడీపీ నేతలకు చంద్రబాబు షాక్..! : నామినేటెడ్ పదవులపై డైలామా
హైదరాబాద్ : చేతిలో అధికారం లేదు.. అయితేనేం అధినేత పక్క రాష్ట్ర సీఎంగా ఉన్నారు, అంతకుమించి కేంద్రంలోను భాగస్వామ్యం ఉంది. ఎలాగూ ఏదో ఒక పదవి ఇప్పించకపోతారా..? అని ఎదురుచూస్తోన్న టీ-టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లేలా మారాయి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు.
'మేమేం పదవులు ఆశించట్లేదు.. మాకు పదవులు వద్దు.. రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవ్వండి' ఇది సీఎం చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్య. పదవుల వద్దంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణ తెలుగు తమ్ముళ్లను మరింత అసంతృప్తిలోకి నెట్టేదిగా మారింది. ఇప్పటికే పార్టీ ద్వారా తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును ఊహించడం ఇక కష్టమేనన్న ఆలోచనలో ఉన్న నేతలు.. నామినేటెడ్ పోస్టులపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.
తీరా ఇప్పుడు మాకు పదవులు వద్దంటూ.. చంద్రబాబు వ్యాఖ్యానించడంతో, అటు రాష్ట్ర రాజకీయాలకు గాక, ఇటు పార్టీ రాజకీయాలకు కాకుండా పోయేలా తయారైంది నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న టీ-టీడీపీ నేతల పరిస్థితి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఢిల్లీ లోని నామినేటెట్ పదవుల్లో తెలంగాణ నేతలకు స్థానం కల్పిస్తారన్న వాదన అప్పట్లో వినపడింది.

అదీగాక, పార్టీలో సీనియర్ అయిన మోత్కుపల్లి లాంటి నేతలకు గవర్నర్ పదవులను సైతం కట్టబెడుతున్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలోకి రాలేదు. దీంతో అప్పటికే తీవ్ర అసంతృప్తిలో కూరుకుపోయిన మోత్కుపల్లి కనీసం రాజ్యసభకైనా పంపించాలంటూ పార్టీ వేదికలపై బాహాటంగానే తన మనసులో మాట బయటపెట్టారు. అయినా లాభం లేకపోయింది. ఆఖరికి రాజ్యసభలోను మోత్కుపల్లికి బెర్త్ దక్కలేదు. అటూ మరో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిది అదే పరిస్థితి.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఢిల్లీ నామినేటెడ్ పోస్టులపై చాలా ఆశలు పెట్టుకున్న పాల్వాయి రజనీ, సీనియర్ నేత పెద్దిరెడ్డి లాంటి వారికి చంద్రబాబు తాజా వ్యాఖ్యలు మింగుడుపడని విధంగా మారాయి. దీంతో ఇప్పటికే సందిగ్దంలో పడ్డ తమ రాజకీయ భవితవ్యాన్ని చంద్రబాబుపై నమ్మకంతో టీడీపీలోనే కొనసాగిస్తారా..? లేక మిగతా పార్టీల నేతల్లాగే రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ పార్టీలు మారే ఆలోచన చేస్తారా..? అన్న సంశయాలు తలెత్తకమానడం లేదు.
అయితే చంద్రబాబు తాజా వ్యాఖ్యలు ఏపీ నేతలకే పరిమితమవుతాయా..? టీడీపీ నేతలకు వర్తిస్తాయా..? అన్నది కూడా ఇప్పడు టీ-టీడీపీ నేతల్లో తలెత్తుతున్న సందేహం. మరోవైపు పార్టీకి చెందిన ఢిల్లీ వర్గాలు
మాత్రం నామినేటెడ్ పదవుల విషయంలో తెలంగాణ నేతలకు బెర్తులు దక్కుతాయన్న నమ్మకాన్ని ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి నామినేటెడ్ పదవులకు సంబంధించి టీ-టీడీపీ నేతల నిరీక్షణకు ఇంకెప్పుడు తెరపడుతుందో..?












Click it and Unblock the Notifications