ఏం సంబంధం, నేనే పోరాడుతా, అదీ ఆయన విధానం.. పవన్ గురించి మాట్లాడనని: బాబు షాక్
జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు పోలిక తీసుకు వచ్చిన వారికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని ఆయన నిలదీశారు.
హైదరాబాద్: జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు పోలిక తీసుకు వచ్చిన వారికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని ఆయన నిలదీశారు.
జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఉద్యమించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి చీఫ్ వైయస్ జగన్ తదితరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జల్లికట్టుకు, హోదాకు సంబంధం ఏమిటని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అయితే, నేరుగా విలేకరులు పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించినప్పుడు మాత్రం మాట్లాడనని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ల గురించి అడగగా.. దాని గురించి తాను మాట్లాడానని, వారి పార్టీ విధానాలు వారివి అని చెప్పారు.
కొందరికి చిచ్చు పెట్టడమే పనిగా మారిందని వైసిపి అధినేత జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటనపై మాట్లాడుతూ.. ఏపీని అగ్రగామిగా నిలవాలన్న సంకల్పాన్ని దావోస్ వేదికగా ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు.
దావోస్ సదస్సుకు హాజరైన వారిలో 1200 మంది వివిధ కంపెనీల సీఈవోలే అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించానని చెప్పారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా మలచాలని, 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
భారత్లో రిఫైనరీ స్థాపనకు సౌదీ ఆరాంకో ముందుకు వచ్చిందని, పదిహేను రోజుల్లో ఆ బృందం రాష్ట్రానికి రానుందని చెప్పారు. ఏపీలో అడుగుపెట్టేందుకు బిబోబ్ అధ్యయనం చేస్తామని చెప్పిందని, జింక్ స్మెల్టర్ ఒక యూనిట్ స్థాపించేందుకు ముందుకొచ్చిందన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేని కొందరు ఆందోళనలు, వివాదాలు సృష్టించాలని చూస్తున్నారన్నారు.
విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు విచిత్రంగా ఇప్పుడు తనకు లేఖలు రాస్తున్నారని.. ఆ లేఖలేవో ఆనాడే రాసి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదని కేవీపీ రామచంద్ర రావును ఉద్దేశించి అన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టడమే కొంతమందికి పనిగా మారిందన్నారు.
భవిష్యత్తు కోసమే..
ఆయన సోమవారం తన దావోస్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. తాను రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు.
హోదాకు సమానంగా ప్యాకేజీ
ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీకి తాను అంగీకరించానని చెప్పారు. కేంద్రంతో గొడవ మంచిది కాదని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
నేనే పోరాడుతా
ఏపీకి అన్యాయం జరిగితే తానే స్వయంగా పోరాటం చేస్తానని చెప్పారు. జల్లికట్టు ఉద్యమానికి, హోదాకు సంబంధం లేదన్నారు. అసలు వాటి మధ్య పోలిక ఏమిటి అని అభిప్రాయపడ్డారు. యువత రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.
పోలవరం పరిహారం వైఫల్యం వారిదే..
రాష్ట్రం బాగు కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని చెప్పారు. పోలవరం పరిహారం చెల్లింపుల విషయంలో అధికారులదే వైఫల్యం అని చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశంపై కమిటీ నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం సరికాదన్నారు.