ఇక ‘చంద్రన్న పెళ్లి కానుక’: అలసిన మంత్రులపై బాబు సరదా వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ ప్రభుత్వం బీసీ సామాజిక వర్గంలో పెళ్లి చేసుకునే పేద వధూవరులకు 'చంద్రన్న పెళ్లి కానుక' పేరుతో రూ.30వేలు అందించనుంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ కీలక నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.
జనవరి నుంచి అమల్లోకి..
చంద్రన్న పెళ్లి కానుకను 2018 జనవరి 1 నుంచి అమల్లోకి తేవాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ కొనసాగింది.
బాధాకరం..
అంతేగాక, మూడో విడత రైతు రుణమాఫీ, ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పెరిగినా ఇంకా ఇలాంటి వ్యాధులతో చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
టెక్నాలజీతో..
టెక్నాలజీతో వ్యాధుల నివారణ చేపట్టాలని కేబినెట్లో చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ లేనిరోజుల్లోనే అనేక వ్యాధులకు నియంత్రణ చేశామన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని సీఎం చెప్పారు. డెంగ్యూ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూ చేస్తానన్నారు.
అలసిన మంత్రులపై సరదాగా..
రాజధానిలో నూతనంగా నిర్మించే ఎమ్మెల్యేల నివాసాలపై సీఆర్డీఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందజేశారు. దీంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బ్రహ్మాండంగా ఉందని మంత్రులు అన్నారు. తమరు అలిసిపోయి ఇంటికి వెళ్లాలనే తొందరలో అలా చెబుతున్నారులే అని చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. బుధవారం మరోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పరిశీలిద్దామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు.