ఎవరికీ భయపడం, తెలుగు జాతిని అవమానిస్తే ఊరుకోం: 3 పార్టీలపై బాబు
కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నగరదర్శిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, వైసీపీ, జనసేనలపై విమర్శలు గుప్పించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వైసీపీ, జనసేన పార్టీలు కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
నాడు వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. టీడీపీ ఎవరికీ భయపడదని చెప్పారు. సమైక్య ఏపీలో తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి హైదరాబాదుకు పెట్టుబడులు తీసుకు వచ్చి, ప్రపంచపటంలో పెట్టామన్నారు. టీడీపీకి ఘన చరిత్ర ఉందన్నారు. వీపీ సింగ్ను ప్రధానిగా చేసిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు. ఆ తర్వాత పలువురిని ప్రధానిగా కావడంలో టీడీపీ సహకరించిందన్నారు.

వాజపేయి ప్రభుత్వానికి సహకరించామన్నారు. తెలుగు జాతిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. హక్కులు సాధించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీయేలో కలిశానని చెప్పారు. నాలుగేళ్ల పాటు వేచి చూశానని చెప్పారు. నాలుగేళ్లు చూసినా ఫలితం లేకపోయేసరికి ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. కానీ కేసుల మాఫీ కోసం వైసీపీ మనలనే విమర్శిస్తోందన్నారు.
ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోనులో నిలబడే వ్యక్తి తనను విమర్శిస్తున్నారని, అందుకు తనకు బాధ వేస్తోందని చంద్రబాబు అన్నారు. తాను జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. ఇటీవల కాలంలో అన్నింట్లో మనమే నెంబర్ వన్గా ఉన్నామని చెప్పారు. హోదాపై కేంద్రం తప్పుదారి పట్టిస్తోందన్నారు. ఓ సమయంలో ఆయన ఆవేశంగా వీళ్లు మనుషులా, రాక్షసులా ఏమనుకోవాలన్నారు.
కేంద్రం సహకరించి ఉంటే మనం ఇంకా ముందు ఉండేవాళ్లమన్నారు. కేంద్రం అడుగడుగునా సహాయ నిరాకరణ చేస్తే, ఇక్కడ వైసీపీ, పవన్ కళ్యాణ్ మనపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఇప్పుడు డ్రామాలు ఆడుతోందన్నారు. కేసుల మాఫీ కోసం ఎన్డీయేతో లాలూచీ పడి ఇక్కడ నిత్యం మనపై విమర్శలు చేయడం, మనపై కోర్టులకు వెళ్లడం, ప్రజలను రెచ్చగొట్టడం వైసీపీ పని అని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదన్నారు.












Click it and Unblock the Notifications