కేసీఆర్ను ప్రోత్సహించా, కొత్తగా పవన్ను తెచ్చారు: కాంగ్రెస్తో పొత్తుపై అసలు విషయం చెప్పిన బాబు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని చెప్పారు.
అప్పుడు చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం: రాహుల్ గాంధీకి మాజీ కాంగ్రెస్ నేత ఝలక్
విభజన హామీలు నిలబెట్టాలని 29సార్లు తాను ఢిల్లీకి వెళ్లానని చంద్రబాబు చెప్పారు. రెవెన్యూ లోటు తమకు 15 కోట్లు ఇవ్వాలని చెప్పారు. హామీల అమలు కోసం టీడీపీ ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేశారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారని చెప్పారు. వారు ప్రధాని మోడీని విమర్శించడం లేదన్నారు.
హైదరాబాదును ఎవరు అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు
హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టింది తెలుగుదేశం పార్టీనే అని చంద్రబాబు చెప్పారు. హైదరాబాదును ఎవరు అభివృద్ధి చేశారో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ఎన్నికలు అంటే ప్రధాని నరేంద్ర మోడీకి వణుకు అని, మోడీ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వణుకు అన్నారు. మట్టి, నీరు తెచ్చి నాడు మోడీ మనసులో మాటను బయటపెట్టారన్నారు.
ప్రధాని చెప్పేది ఒకటి, చేసేది మరొకటి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మోడీని విమర్శించరని, హక్కుల కోసం పోరాడరని చంద్రబాబు అన్నారు. బెదిరింపులు దిగుతూ రాష్ట్రంలో ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల తరఫున మేం నిలబడితే ఐటీ దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నారు. అవినీతిని పెంచిపోషిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీ తన స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిప్డడారు.
కేసీఆర్ను నేనే ప్రోత్సహించా
తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన కూడా చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒకప్పుడు మన (టీడీపీ)లోనే ఉన్నారని, నేనే అతనిని ప్రోత్సహించానని చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. మోడీ చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపించారు. తాను 1996లో ముఖ్యమంత్రి అయితే మోడీ 2002లో అయ్యారని, అతని కంటే నేను సీనియర్ అని, కాీ అదృష్టం బాగుండి మోడీ ప్రధాని అయ్యారని చెప్పారు. మనలను కించపరిస్తే బాగుండదని చెప్పానని అన్నారు.
లాలూచీ రాజకీయాలు
ప్రధాని మోడీ నిండు సభలో కేసీఆర్ను ప్రశంసిస్తారని, నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడ్డానని అంటారని, కానీ నేను వారి ఉచ్చులో పడలేదని చంద్రబాబు అన్నారు. నేను ఎప్పుడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లాలూచీ రాజకీయాలు చేయలేదని చెప్పారు. నేరుగా రాజకీయాలు చేస్తానని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్తో, ఏపీలో జగన్తో లాలూచీ పడి రాజకీయాలు చేస్తున్నారని మోడీపై మండిపడ్డారు.
కొత్తగా పవన్ను తీసుకొచ్చారు, తెలంగాణలో పోటీ చేయడం లేదేం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కొత్తగా తీసుకు వచ్చి టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని, అది మీకు చేతకాదని మోడీని ఉద్దేశించి చెప్పారు. టీడీపీని ఎవరు దెబ్బతీయాలని భావించినా తమ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే లాలూచీ రాజకీయం అన్నారు.
అసలు విషయం చెప్పిన చంద్రబాబు
మనం ఒక్కరమే (టీడీపీ ఒక్కటే) బీజేపీని ఎదుర్కోలేమని, దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉందని, అందుకే నలభై ఏళ్ల భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఆ పార్టీతో కలిశామని చంద్రబాబు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాష్ట్ర హక్కుల కోసం, దేశం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిశామని తెలిపారు. సీబీఐ, ఐటీ వంటి సంస్థలు మోడీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. ఈ సందర్భంగా సీబీఐలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. గుజరాత్ మనిషి ఆస్తానా సీబీఐని భ్రష్టు పట్టించారన్నారు. దోవల్ కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నారంటే ఈ దేశ పరిస్థితి ఏమవుతుందని వాపోయారు. అధికారం దుర్వినియోగం అవుతుందనే సీబీఐని ఏపీలోకి నిరాకరించామని చెప్పారు. నోట్ల రద్దు పెద్ద పార్సుగా మారిందన్నారు. రూపాయి విలువ పడిపోయిందని, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. వ్యాపారులు, రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. మోడీ మాటల ప్రధాని మాత్రమేనని, ప్రజలకు లాభం లేదని చెప్పారు.