యూటర్న్ ఎవరిది?: బాబు ప్రశ్న, వదిలేయడానికి సిద్ధం.. ఎమ్మెల్యేలకు క్లాస్
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు ధర్మపోరాట సభకు ఎంపీలు హాజరుకావాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీపై మండిపడ్డారు. బీజేపీనే యూటర్న్ తీసుకున్నదని, తెలుగుదేశం పార్టీది ఎప్పుడూ రైట్ టర్నే అన్నారు. ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం యూటర్న్ కాదా అని ప్రశ్నించారు.
వారిలా ఒళ్లు బలిసి మాట్లాడను, ఎన్ని కష్టాల మధ్య: పెళ్లిళ్లపై పవన్, ఫ్లెక్సీలు తొలగింపు
మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం యూటర్న్ కాదా అన్నారు. పదేళ్లు హోదా ఇస్తామని ఇవ్వకపోవడం యూటర్న్ కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీ - ముంబై కారిడార్కు ఓ న్యాయం, విశాఖపట్నం - చెన్నై కారిడార్కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. టీడీపీని దెబ్బతీయడానికి మూడు పార్టీలు కలిసి లాలూచీపడ్డాయన్నారు. టీడీపీ ఒంగోలు ధర్మపోరాట సభ రోజే మరోచోట పోటీ దీక్షలా అన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల లాలూచీ బయటపడిందన్నారు.
టీడీపీని దెబ్బతీసేందుకు మూడు పార్టీల కుట్ర
పార్లమెంటులో టీడీపీ ఎంపీల పోరాటంపై ప్రజల్లో ప్రశంసలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎంపీలు పార్లమెంటులో ఎండగట్టారని, తమకు అప్పగించిన బాధ్యతను పకడ్బంధీగా నిర్వర్తించారన్నారు. పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలని దిశా నిర్దేశనం చేశారు. కేంద్రం ఒంటెత్తు పోకడలకు పోతోందన్నారు. బీజేపీ అన్యాయాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు మూడు పార్టీలు లాలూచీపడి కుట్రలు చేస్తున్నాయన్నారు. ఒంగోలు ధర్మపోరాట సభ రోజే మరోచోట పోటీ దీక్షలు చేస్తున్నారని, దీంతో బీజేపీ, వైసీపీ, జనసేనల లాలూచీ తేలిపోయిందన్నారు.
అనుభవం లేని వాళ్లు వస్తే ఇబ్బందులు
ఏపీ అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అంతకుముందు రోజు కొవ్వూరులో అన్నారు. సమర్థ నాయకత్వంపై ఎన్నికలప్పుడే కాకుండా ఇప్పటి నుంచే చర్చ జరగాలన్నారు. అనుభవం లేనివాళ్లు వస్తే రాష్ట్రం ఇబ్బందులకు గురవుతుందన్నారు. మన ఎంపీల పోరాటంతో కేంద్రం గజగజ వణుకుతోందన్నారు. తెలుగుజాతి ఒక్కటై కుట్రదారులను తిప్పికొట్టాలన్నారు. సీట్ల కక్కుర్తితో మోడీ అవినీతి వైసీపీతో లాలూచీ పడ్డారన్నారు. మనది ధర్మపోరాటమని, ధర్మమే గెలుస్తుందన్నారు.
కేసీఆర్ను మెచ్చుకున్నందుకు బాధలేదు కానీ
కేసీఆర్ తన సహచరుడు అని, ఆయన ముఖ్యమంత్రి అయినందుకు తాను బాధపడలేదని, ఆయనను పొగుడుకోవచ్చునని, కానీ ఆయనను పొగిడి, తనను పరిణితి లేదని చెప్పడం దారుణమని చంద్రబాబు అన్నారు. మీ సర్టిఫికేట్ తనకు అవసరం లేదని మోడీని ఉద్దేశించి అన్నారు. మా ప్రజల బాగోగులు మాకు చాలన్నారు.
ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం
పెందుర్తిలో అధికారుల తీరుకు వ్యతిరేకంగా పార్టీ ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, పెందుర్తి వెంకటేష్ల నిరసనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పట్ల ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించమన్నారు. పార్టీ ప్రతిష్ట దిగజార్చే వారినే వదులుకునేందుకు సిద్ధమన్నారు. ఎయిర్ పోర్టులో రామారావు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. పెందుర్తి అధికారులకు వ్యతిరేకంగా వెంకటేష్ నిరసన తెలిపారు. దీనిపై పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.