ప్రపంచానికి పాఠం చెప్తున్నా, జగన్ డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పట్లేదు: బాబు
తనకు ఇంగ్లీష్ రాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, తాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ చేశానని, ప్రపంచానికి పాఠాలు చెబుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు.
అమరావతి: తనకు ఇంగ్లీష్ రాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, తాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ చేశానని, ప్రపంచానికి పాఠాలు చెబుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.
అసలు జగన్ డిగ్రీ ఎక్కడ చదివారో ఇంత వరకు చెప్పలేదని విమర్శలు గుప్పించారు. శ్రీశైలం నుంచి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు సాగునీటిని తరలించడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు.
2019 ఎన్నికలు ఏకపక్షమేనని చంద్రబాబు అంతకుముందు చెప్పారు. అభ్యర్థుల్ని కొనుగోలు చేశామని జగన్ అంటున్నారని, డబ్బులు ఎవరి వద్ద ఉన్నాయో ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసిపికి గుర్తింపే రాలేదన్నారు. అలాంటిప్పుడు ఆయా ప్రజాప్రతినిధులు తమ వాళ్లని జగన్ ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఖర్చులకు, అంచనాలకు తేడా తెలియని స్థాయిలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్ నేర్చుకునే ప్రయత్నం చేయరని, చెప్పినా వినరన్నారు.
పులివెందులలో పోటీ చేయాలన్న జగన్ సవాల్పై సీఎం స్పందిస్తూ.. 2019లో పులివెందుల స్థానం టిడిపిదే అన్నారు. ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి, సంక్షేమం, ఆనందం అని, ఆ మూడు తాను ఇస్తున్నప్పుడు మరో పార్టీతో ప్రజలకు పని ఏమిటన్నారు. ఏడాది జైలుకెళ్లిన చరిత్ర జగన్దన్నారు.