అవిశ్వాసంపై ఆ ముగ్గురికి ఛాన్స్, మోడీని నిలదీయండి: బాబు ఆదేశాలు!
అమరావతి: విభజన చట్టం హామీలు, ఇప్పటి వరకు జరిగిన తీరు, ఏపీకి రావాల్సిన నిధులు, ఆర్థిక లోటు, లోటు భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. అవిశ్వాస తీర్మానం నేపత్యంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమావేశంతో పాటు ఎంపీలు, మంత్రులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?
ఈ భేటీలో ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులు, రావాల్సిన నిధులను ఫైనాన్స్ సెక్రటరీ సీఎంకు వివరించారు. విభజన చట్టం హామీల వివరాలను ఎంపీలకు ఇచ్చేందుకు సమాచారం సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ రాత్రికే నోట్ను ఎంపీలకు అందించనున్నారు. ఢిల్లీకి వెళ్లాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు తదితరులను ఆదేశించారు.
ఈ ముగ్గురికి ముఖ్యంగా మాట్లాడే అవకాశం
అవిశ్వాసం నోటీసు ఇచ్చిన కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులకు ముఖ్యమంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పైన బీజేపీ వ్యూహాన్ని బట్టి ప్రతి వ్యూహం రచించాలని నిర్ణయించారు. భావసారూప్యత కలిగిన మిగతా పార్టీల నాయకులతో విభజన హామీలు, ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడాలని ఎంపీలకు ఆదేశాలు జారీచేశారు.
మోడీ వివరణ తర్వాత కూడా సద్వినియోగం చేసుకోవాలి
అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ వివరణ తర్వాత కూడా మాట్లాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. బీజేపీ నేతలు సభలో అబద్దాలు చెబితే అక్కడికి అక్కడే తిప్పికొట్టాలన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోని కేంద్రం ఏపీకి చేసిన న్యాయం ఏమిటో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిలదీయాలని సూచించారు. ఏం చేస్తామన్నారు.. ఏం చేశారో లెక్కలతో సహా దేశం దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు.
ఇవన్నీ ఇవ్వాలి
నాలుగేళ్లయినా అమరావతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవన్నారు. రాజధానికి కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. వివిధ సంస్థల శంకుస్థాపనల సమయంలో కేంద్రమంత్రులు చేసిన ప్రసంగాలను గుర్తు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.2,200 కోట్లు కేంద్రం నుంచి రావాలన్నారు. డీపీఆర్ 2కు ఆమోదం తెలపాలన్నారు.
కేంద్రం సృష్టించిన సమస్యలు ఎండగట్టాలి
తొలి ఏడాది ఆర్థిక లోటు కేంద్ర బడ్జెట్లోనే విడుదల చేయాలని చంద్రబాబు అన్నారు. దేశంలో జైకా నిధులు ఒక్కరాష్ట్రానికేనా అన్నారు. బుల్లెట్ ట్రైన్ ఒక్కదానికే జైకా నిధులు వినియోగించడం ఏమిటని ప్రశ్నించారు. స్వల్ప వడ్డీ ప్రయోజనం ఒక్క రాష్ట్రానికేనా అన్నారు. ఢిల్లీ - ముంబై కారిడార్కు ఎంతిచ్చారు, మనకు ఎంతిచ్చారని ప్రశ్నించారు. కేంద్రం సృష్టించిన సమస్యలను ఎండగట్టాలన్నారు.
అన్యాయం జరిగిన చోటే న్యాయం జరగాలి
లోకసభవేదికగా ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు అన్నారు. అదే వేదికగా ఏపీకి న్యాయం జరగాల్సి ఉందన్నారు. విభజన సమయంలో సాక్షులుగా ఉన్న పార్టీలకూ బాధ్యత ఉందని, కాంగ్రెస్, బీజేపీలు సహా ఇతర పార్టీలను ఉద్దేశించి అన్నారు. అన్ని పార్టీలతోను సమన్వయం చేసుకొని అవిశ్వాసంపై ముందుకు సాగాలని ఎంపీలకు సూచించారు. నష్టంలో ఉన్న ఏపీని మరింత ముంచాలని బీజేపీ చూస్తోందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమని, పన్నుల రూపంలో రాబడి పొందేంది కేంద్ర ప్రభుత్వమని చంద్రబాబు అన్నారు.