అడ్డంగా బుక్కయ్యారు: 'కేసు నుంచి బయటపడేందుకే సుజనాను ఢిల్లీకి పంపారు'
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా సాధనపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైసీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో వైయస్ జగన్ శుక్రవారం నివాళులర్పించారు.
అనంతరం ఇడుపులపాయలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన రెయిన్ గన్ల పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారని జగన్ ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో పూర్తిగా కూరుకుపోయిన చంద్రబాబు పాలనను గాలికి వదిలేసి ఈ కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో సీఎం స్వయంగా పట్టుబడడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని, ఇదే మొదటిసారని అన్నారు.
ఈ కేసులో చంద్రబాబు పట్టుబడినప్పటికీ అరెస్ట్ కాకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయనకున్న అధికారులు కేసు నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సదరు కేసు నుంచి బయటపడేందుకే సుజనా చౌదరిని చంద్రబాబు ఢిల్లీకి పంపారన్నారు.

చంద్రబాబు పాత్రపై విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించిన వెంటనే సుజనా చౌదరి పరుగున వెళ్లి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అమిత్ షాలను కలిశారని గుర్తు చేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చి గవర్నర్తో భేటీ అయ్యారని అన్నారు. హోదా కోసం కలిశామంటూ జనం చెవుల్లో పూలుపెడుతున్నారని మండిపడ్డారు.
ఏపీ ప్రత్యేక హోదాకు, గవర్నర్ నరసింహాన్కు ఏమైనా సంబంధం ఉందా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధం అని అన్నారు. డబ్బు సంపాదన, కేసుల నుంచి ఎలా బయటపడాలనే దాని గురించే చంద్రబాబు ఆలోచిస్తుంటారని అన్నారు.
స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. రైతులపై చంద్రబాబు ఏమాత్రం ప్రేమ లేదని, రెయిన్ గన్లపై చంద్రబాబు రైతులను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 11 ఏళ్ల క్రితమే రెయిన్ గన్స్ అందుబాటులోకి వచ్చాయని జగన్ చెప్పారు.
నీళ్లు లేకుండా రెయిన్ గన్లుతో ఏం ఉపయోగమని జగన్ ప్రశ్నించారు. సీమ ప్రాజెక్టులకు శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణా జలాలను అందించాలని డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లకు అవకాశమున్నా కేవలం 15 టీఎంసీలే ఉంచుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications