ఆ ఇద్దరు ఎంపీలతో చంద్రబాబుకు తలనొప్పులు, ఏం చేయాలి?
పార్టీ అధినేత ఎన్నిసార్లు చెప్పినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తీవ్రంగా నష్టం కల్గిస్తోందని.
అమరావతి: పార్టీ అధినేత ఎన్నిసార్లు చెప్పినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తీవ్రంగా నష్టం కల్గిస్తోందని టిడిపి నాయకత్వం అభిప్రాయపడుతోంది.
మొదటి నుండి పార్టీలో ఉన్న నాయకులు అనుసరిస్తున్న తీరు ఓ రకంగా ఉంటే, 2014 ఎన్నికలకు మందుగా పార్టీలో చేరిన నాయకుల తీరు మరోరకంగా ఉంది. అయితే పార్టీలో కొత్త, పాత నాయకులను కలుపుకుపోవాల్సిన చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.
అయినా వారు పెడచెవిన పెడుతున్నారు. అంతేకాదు కొన్ని అంశాల్లో బహిరంగంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాట్లాడే తీరు, వ్యవహరిస్తున్న పద్దతి తీవ్రంగా నష్టం చేస్తోందనే అభిప్రాయంతో టిడిపి అధినేత ఉన్నారు.
విజయవాడలో రవాణాశాఖాధికారులపై కేశినేని నాని తదితరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు పార్టీకి తీవ్రంగా నష్టాన్ని కల్గించాయి.దీంతో అసెంబ్లీ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.
తాజాగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సృష్టించిన వీరంగం కూడ ఆ పార్టీకి ఇబ్బందిని తెచ్చిపెట్టింది.ఈ విషయమై చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా నేతల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జెసిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇద్దరు ఎంపీల తీరుతో టిడిపికి కష్టాలు
అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రె్డ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహరశైలితో టిడిపికి కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఉదంతంపై విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కేశినేని బస్సుల వ్యాపారంలో తమకు చూపిన మార్గంలోనే తాము పయనిస్తున్నామని వారు ప్రకటించడం గమనార్హం. అంతేకాదు కేశినేని విక్రయించిన బస్సుల కొలతల్లో కూడ తేడాలున్నాయని చెప్పారు. అంతేకాదు తాను రాసిన లేఖకు అరుణాచల్ ప్రదేశ్ అధికారులు స్పందించి ప్రైవేట్ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దుచేశారని ఆయన చెప్పారు. ఏపీలో రవాణాశాఖాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నాని ప్రశ్నించారు. మరో వైపు విశాఖ ఎయిర్ పోర్ట్ లో అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుతో ట్రావెల్ బ్యాన్ ను విధించాయి.
టిడిపి తీరుపై విమర్శలు
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా విమానసిబ్బందితో వ్యవహరించిన తీరుపై పలు విమానసంస్థలు ఆయనపై ట్రావెల్ బ్యాన్ ను విధించాయి.అయితే ఈ విషయమై లోక్ సభలో మంత్రి ఆశోక్ గజపతిరాజు ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తీరును తప్పుబట్టారు. ప్రస్తుతం జెసి దివాకర్ రెడ్డి వ్యవహరం టిడిపిని ముప్పుతిప్పలు పెడుతోంది. శివసేన ఎంపీ గైక్వాడ్ ఓ న్యాయం, టిడిపి ఎంపి దివాకర్ రెడ్డికి మరో న్యాయమా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జెసితో క్షమాపణ చెప్పించాలని భావిస్తున్నప్పటికీ ఆయన అందుబాటులో లేకుండాపోయారు. యూరప్ ట్రిప్ లో ఉన్నారు.
రవాణాశాఖపై కేశినేని నాని ఆరోపణలు
విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లపై, రవాణాశాఖాధికారులపై ఆరోపణలు గుప్పించారు. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను ఏపీలో స్టేజీ క్యారియర్లుగా ఎలా తిరగనిస్తారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను ఆంధ్రాలో నిలిపివేసే పరిస్థితి వచ్చింది. అయితే నాని వాదనతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు మాత్రం విబేధిస్తున్నారు.
ప్రయాణీకుల ఇబ్బందులు
ప్రైవేట్ బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. అయితే ఈ విషయమై కేశినేని నాని రవాణాశాఖ అధికారులకు లేఖలు రాస్తూనే ఉన్నారు. సీఎం ఆదేశాలతో అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్సులను కూడ అధికారులు నిలిపేస్తున్నారు. దీంతో ముంబై, చెన్నై, కోల్ కత్తా, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్ళే ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకుంటే పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయంతో కొందరు పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.