నోరుపారేసుకొంటున్నారా, చూస్తున్నా: నేతలకు చంద్రబాబు హెచ్చరిక
అమరావతి: పార్టీలో కొందరు నాయకులు నోరు జారుతున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని ఆయన పార్టీ నాయకులకు హితవు పలికారు.
అమరావతిలో మంగళవారం నాడు టిడిపి సమన్వయకమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మహానాడుతో పాటు పార్టీని సంస్తాగతంగా బలోపేతం చేసే అంశంపై చర్చించారు.
భవిష్యత్ లో ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టాలనే అంశాలపై కూడ చర్చించారు.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశంపై కూడ చర్చించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళడంలో నాయకులు విఫలమయ్యారని బాబు అభిప్రాయపడ్డారు.
నోరు జారడం నష్టం తెస్తోంది
పార్టీకి చెందిన కొందరు నాయకులు నోరు జారుతున్నారని ఈ రకంగా నోరు జారడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో బాబు పలు అంశాలపై చర్చించారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా వాటిని ప్రజలకు వివరించి చెప్పడంలో నాయకులు వైఫల్యం చెందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళగిరి పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆదేశించారు. జన్మభూమి కమిటీల తీరు బాగోలేదనే భావన కూడ ఉందన్నారు. తాగునీటి విషయంలో కూడ ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. ఈ అసంతృప్తి ఇంకా పెరగకుండా జాగ్రత్త పడాలని నాయకులకు ఆయన సూచించారు.
కొందరు చేసే తప్పులు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయి
పార్టీకి చెందిన కొందరు నాయకులు చేసే తప్పులు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయని చంద్రబాబునాయుడు సమావేశంలో చెప్పారు. పార్టీ నాయకులు పార్టీకి ప్రయోజనం కల్గించకపోయినా ఫరవాలేదు. కానీ, పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు నాయకుల్లో పెడధోరణులు పెరిగాయన్నారు. దీని వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని బాబు అభిప్రాయపడ్డారు.పార్టీలో పెడధోరణులను ప్రోత్సహిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.
త్వరలోనే నామినేటేడ్ పోస్టుల భర్తీ
త్వరలోనే నామినేటేడ్ పోస్టును భర్తీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. పై స్థాయి నుండి కిందిస్థాయి వరకు పార్టీ నాయకుల్లో పెడధోరణులు పెరిగిపోయిన విషయాన్ని ఆయన సమావేశంలోనే ప్రస్తావించారు.పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటేడ్ పోస్టులను కట్టబెట్టనున్నట్టు ఆయన చెప్పారు.ఖాళీగా ఉన్న ఆలయ, మార్కెట్ కమిటీలను భర్తీ చేస్తామన్నారు.
పార్టీ కమిటీల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలి
సంస్థాగత ఎన్నికలను పురస్కరించుకొని పార్టీ, అనుబంధ కమిటీల నియామాకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించాల్సిందేనని చంద్రబాబునాయుడు ఆదేశించారు. బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. పార్లమెంటరీ ఇన్ చార్జ్ లు, మంత్రులు తమ పరిధిలోని నేతలతో తరచూ సమావేశాలు కావాలని ఆయన ఆదేశించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు వ్యవహారాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రులు చూసుకోవాలన్నారు.
తాగునీటిపై లోకేష కేంద్రీకరించాలి
రాష్ట్రంలో తాగునీటి విషయంలో ఇంకా 25 శాతం అసంతృప్తి ఉందన్నారు చంద్రబాబునాయుడు. ఈ విషయమై లోకేష్ కేంద్రీకరించాలని చంద్రబాబు సూచించారు. కాంగ్రెస్ హాయంలో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. వ్యోక్స్ వ్యాగన్ వంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోయాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆటోమొబైల్ పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతో కృషిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీని వల్లే కియూ, ఇసుజు వంటి పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకరించాలి
త్వరలోనే కొన్ని ఎంపీటీసి, జడ్ పి టీ సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు బాబు. ప్రతి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించేలా చూడాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. టిడిపిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు.