నాదే పూచీ: జపాన్ పారిశ్రామికవేత్తలకు బాబు భరోసా
హైదరాబాద్: తమవి ఫ్రెండ్లీ ప్రభుత్వాలని, పెట్టుబడులతో రావాలని, మీ పెట్టుబడులకు పూచి తనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పారిశ్రామికవేత్తలతో చెప్పారు. ఇందుకు తాము పెట్టుబడులకు తాము సానుకూలమని ఒకాసా చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ స్పష్టం చేశారు.
సంక్షోభాలను ఎదుర్కొని దీటుగా నిలిచిన జపాన్ను ఆదర్శంగా తీసుకున్నామని, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లోని సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మలచుకుని ముందుకు సాగుతామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు. తమకు పెట్టుబడులు కావాలని, మీకు మార్కెట్ కావాలన్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పెట్టుబడులు లాభదాయకమని, ఏపీలో పెట్టుబడులు సురక్షితమన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం రెండో రోజైన మంగళవారం నాడు కడోవా నగరంలోని పానాసోనిక్ కంపెనీని సందర్శించింది. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమైంది.
చిత్తూరు సమీపంలోని శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన జపాన్ సంస్థల ప్రతినిధులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. అనంతరం ఒకాసా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు ప్రధానోపన్యాసం చేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు.
ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పానాసోనిక్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో రెండో తరం సంస్కరణలు ప్రారంభించామని, గత పదేళ్లలో అభివృద్ధిలో కొంత వెనకబడ్డామని, ఇప్పుడు అభివృద్ధిలో దేశాన్ని ప్రపంచానికే తలమానికంగా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పంలో తాము భాగస్వాములుగా ఉన్నామని, కేంద్ర, రాష్ట్రాల్లో సమర్థ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్నామని, కీలకమైన విమానయాన, శాస్త్ర సాంకేతిక శాఖలకు తమ పార్టీ ఎంపీలే మంత్రులుగా ఉన్నారని, పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఏపీకి సాదరంగా ఆహ్వానించడానికే జపాన్కు వచ్చానని, తమది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత తమదే అన్నారు. పెట్టుబడిదారులకు ఏ సమస్యా రాదని, అందుకు నాదీ పూచీ తనదని భరోసా ఇచ్చారు.
జపాన్తో స్నేహ సంబంధాలకే తమ మొదటి ప్రాధాన్యమన్నారు. భౌగోళికంగా దేశంలోనే ఏపీ కీలక రాష్ట్రమన్నారు. తూర్పు, పశ్చిమ ఆసియా దేశాలకు ఏపీని గేట్ వే ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా చేయాలన్నదే తన సంకల్పమన్నారు. ఎంటర్ ప్రెన్యూర్షిప్లో తెలుగు వారికి ఎవరూ సాటిరారన్నారు. ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రైన్యూర్ను, ఒక ఐటీ నిపుణుడిని తయారు చేయాలన్నదే తన సంకల్పమన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. విభజన చట్టం ప్రకారం, కేంద్రం అనేక ప్రోత్సాహకాలను ఇవ్వనుందన్నారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని పానసోనిక్ యాజమాన్యాన్ని చంద్రబాబు కోరారు.
ఈ సందర్భంగా పానసోనిక్ ఎండీ టకషీ టయోమా మాట్లాడుతూ.. భూగర్భ జలాల శుద్ధికి సహకరిస్తామని, నైపుణ్యాల అభివృద్ధికి చేయూత ఇస్తామన్నారు. ఏపీ నుంచి ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నామని, అందిన వెంటనే రాష్ట్రానికి వచ్చి పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామన్నారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
మావి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వాలు
కేంద్రంలో మోడీ నేతృత్వంలో, ఏపీలో తన నాయకత్వంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఒకాసా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులూ ఉన్నాయన్నారు. సమర్థ నాయకత్వం లేకపోవడం గత పదేళ్ల వెనకబాటుకు కారణమని, ప్రస్తుతం తన నాయకత్వంలోని ఏపీ పురోగతి వేగవంతమవుతుందన్నారు.
రాష్ట్రంలో విశాఖ, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులున్నాయని, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉత్పత్తులను సింగపూర్, మలేషియా, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఓడరేవుల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామన్నారు. భౌగోళిక అనుకూల అంశాలతోపాటు బొగ్గు, బెరైటీస్, గ్రానైట్, మాంగనీస్, ఇనుప ఖనిజం, బాక్సైట్ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏపీలో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కోరారు.