చంద్రబాబు ఆదేశాలు బేఖాతర్: 'చిత్తూరుకు జలకళ, కడప డ్యామ్లన్నీ నిండాయి'
అమరావతి: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు రెండో రోజూ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సోమశిల డ్యామ్ను ఆయన పరిశీలించారు. సోమశిల డ్యామ్ వద్ద జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జలవనరుల పరిస్థితి, వినియోగంపై నీరు-ప్రగతి పేరుతో త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.
సోమశిల జలాశయంలో ప్రస్తుతం 54.5 టీఎంసీల నీరు ఉందని, నెల్లూరు జిల్లాలో ఈ సారి 16 లక్షల ఎకరాల్లో పంట సాగుకు ప్రణాళికలు చేస్తున్నట్లు బాబు వెల్లడించారు. తక్కువ నీటితో పంటలు సాగయ్యే ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామన్నారు. రెండో పంటకు కూడా నీరిస్తామన్నారు. సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీ పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు.
సోమశిల డ్యామ్ పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉందన్నారు. సోమశిల, పెంచలకోన, మైపాడు బీచ్, కండలేరులను అనుసంధానిస్తామని తెలిపారు. ఈ నాలుగు ప్రాంతాల అనుసంధానం ద్వారా పర్యాటకం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణపు పనులను అస్తవ్యస్తంగా జరిగాయన్నారు.
అధికార యంత్రాంగాన్ని కాంగ్రెస్ పాలకులు నిర్వీర్వం చేశారని, తద్వారా వరద బాధితులకు సాయమందించే ప్రక్రియ ఆలస్యమవుతోందని బాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో కూడా జలకళ వచ్చిందన్నారు. 20 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి వర్షాల కారణంగా ఈ జిల్లాకు జలకళ వచ్చిందన్నారు. కడప జిల్లాలోని అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయన్నారు.

జలదిగ్బంధంలో ఉన్న నెల్లూరులో సహాయక చర్యలను ముమ్మరం చేసేక్రమంలో ప్రభుత్వం శనివారం 50 మంది డిప్యూటీ కలెక్టర్లను నెల్లూరుకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా నెల్లూరుకు వెళ్లి జిల్లా కలెక్టర్కు రిపోర్టు చేయాలని పేర్కొంది.
అదేవిధంగా విశాఖపట్నం జిల్లా నుంచి 70 మంది అధికారుల బృందాన్ని ప్రభుత్వం నెల్లూరుకు పంపింది. ఈ బృందంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్, ఐటీడీఏ పీవోతోపాటు తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లు, 15 మంది తహసీల్దార్లు, 15 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 20 మంది సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, 10 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.
చంద్రబాబు ఆదేశాలను లెక్కచేయని అధికారులు...!
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలను అక్కడి అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 22 మంది ఐఏఎస్ అధికారులను సీఎం నియమించారు. అయితే, చంద్రబాబు పర్యటిస్తున్న గ్రామాల్లో ఆ అధికారులు కనిపించకపోవడంపై పలు విమర్శలు తలెత్తాయి.
కేవలం సమీక్షలకే వారు పరిమితమవుతున్నారని స్థానికులు, విపక్షపార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. వరదనష్టం, ప్రస్తుత పరిస్థితి గురించిన వివరాలను ఆయన తెలుసుకోనున్నారు.












Click it and Unblock the Notifications