ఆసక్తికరం: దావోస్లో ఇప్పటికే కేటీఆర్, సాయంత్రం బాబు, పెట్టుబడులపై పోటీ
హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నుంచి 25వ తేదీ వరకు దావోస్లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో వ్యవసాయం, ఔషధరంగం, సోలార్ ఎనర్జీ, ఐటీ, మౌలిక వసతులు వంటి కీలక రంగాలకు సంబంధించి ఎంవోయులను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోనుంది.
పవన్కు ముద్రగడ ఏం చెప్పారంటే! ఇలా చేశారేమిటి.. అనూహ్యంగా వ్యూహం మార్చారా?
ఆదివారం సాయంత్రం చంద్రబాబు దావోస్ బయలుదేరనున్నారు. వరుసగా నాలుగో ఏడాది వరల్డ్ ఎకనామిక్ సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. గత రెండు మూడేళ్లుగా దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక పెట్టుబడులు తీసుకు రాగలిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కీలకమైన ఉపన్యాసాల్లో ప్రధానవక్తగా చంద్రబాబు ఉండనున్నారు.
మోడీతో చంద్రబాబు గంటన్నరపాటు
ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు గంటన్నరపాటు గడపనున్నారు. ప్రభుత్వం ఈసారి వ్యవసాయం - భవిష్యత్తు, ఆహార భద్రత, గ్లోబల్ ఫండ్, ఐటీ, ఇన్ప్రాస్ట్రక్చర్, మానుఫాక్చరింగ్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. దావోస్కు వచ్చే పారిశ్రామికవేత్తలను, వచ్చే నెలలో రాష్ట్రంలో జరగబోయే సీఐఐ సదస్సుకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
ఏపీ లాంజ్కు ప్రధాని మోడీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత క్రిస్టల్ అవార్డుల ప్రధాన వేడుకలో పాల్గొంటారు. మరుసటి రోజు ఏపీ లాంజ్లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. రెండోరోజు ప్రధాని మోడీ ఏపీ లాంజ్ను సందర్శిస్తారు. ఇండియా లాంజ్లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో చంద్రబాబుపాల్గొంటారు.
మూడు, నాలుగో రోజు ఇలా
మూడో రోజు హోటల్ బెల్విడర్లో లంచ్ ఆన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీస్ ఫర్ టుమారో అనే అంశంపై టెక్నాలజీలో వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడుతారు. అనంతరం సీఐఐ సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు ప్యానలిస్టుగా పాల్గొంటారు. ఆ తర్వాత బహ్రెయిన్లో పెట్రోలియం కంపెనీ చైర్మన్ షేక్ బిన్ ఖలీఫా ఆల్ ఖలీఫా ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. నాలుగో రోజు మూడు ఎంవోయులను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ప్రోన్ హోపర్-ఏపీఈడీబీ మధ్య ఒక అవగాహన ఒప్పందం, హిటాచీతో మరో ఎంఓయు, జ్యూరిచ్తో సిస్టర్ సిటీ ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఇప్పటికే దావోస్లో కేటీఆర్
మరోవైపు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే దావోస్ చేరుకున్నారు. ఆయనకు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు కేటీఆర్ జపాన్లో పర్యటించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు ప్రధాని మోడీతోపాటు ప్రపంచంలోని వందకుపైగా దేశాల నుంచి అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు, నిర్వాహకులు, 2500 ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించనున్నారు. పలు ఎంవోయులు కుదుర్చుకోనున్నారు.