ఖబడ్దార్, జాగ్రత్త: బొత్స కోటలో చంద్రబాబు హెచ్చరిక
విజయనగరం: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోట విజయనగరంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పార్టీ నాయకులను ఖబడ్దార్, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. బొత్స సత్యనారాయణపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. గురజాడ అప్పారావు వంటివాళ్లు పుట్టిన తులసివనంలో బొత్స గంజాయి మొక్క అని ఆయన అన్నారు. విజయనగరంలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సోనియా గాంధీని ఆయన గాడ్సేగా అభివర్ణించారు. తమ పార్టీని దెబ్బ తీయడానికి తెలుగుజాతిలో చిచ్చు పెట్టిందని ఆయన విమర్సించారు. విభజన విషయంలో మట్టి కన్నా హీనంగా తమను చూశారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను చూసుకుని కాంగ్రెసు పార్టీని తుడిచిపెట్టుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కాంగ్రెసుతో సంబంధాల విషయంలో మాట మార్చారని, అటువంటి కెసిఆర్ను చూసి సోనియా గాంధీ సిగ్గు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.
2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ అయ్యారని, తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే మోడీ అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రోబో అని ఆయన వ్యాఖ్యానించారు. కళ్లుండి చూడలేరని, చెవులుండి వినలేరని, నోరుండి మాట్లాడలేరని ఆయన మన్మోహన్ సింగ్పై వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీ వైయస్ జగన్, బొత్స వంటి అనకొండలను పెంచి పోషించారని ఆయన అన్నారు. ఊరికొక్కరిని అనకొండలుగా సృష్టించారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని దోచిన డబ్బులో వాటా ఇస్తే వైయస్ రాజశేఖర రెడ్డిపై సోనియా ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. సమస్యలన్నింటికీ సోనియానే కారణమని ఆయన అన్నారు. తన జీవితంలో ఓటమి లేదని, అనుకున్నది సాధించానని ఆయన చెప్పారు.
విభజన విషయంలో సమధర్మం పాటించాలని తాను అడిగానని, ఆరు నెలల పాటు అందరినీ కలిశానని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ తన ఇష్టానుసారం చేసిందని తప్పు పట్టారు. విభజన తర్వాత చాలా నిరుత్సాహపడ్డానని, మనసు బాధ పెట్టుకుని విజయనగరం వచ్చానని ఆయన అన్నారు. తెలుగు ప్రజలతో ఫుట్బాల్ మాదిరిగా ఆడుకున్నారని ఆయన అన్నారు. సీమాంధ్రకు బిచ్చమేశానని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అంటున్నారని, తమకు బిచ్చం అక్కర్లేదని ఆయన అన్నారు. తన కోపం సోనియా గాంధీ మీదనే అని ఆయన అన్నారు.
తాను ఓటమిని అంగీకరించబోనని, పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. బిజెపి నుంచి తాను చాలా ఆశించానని ఆయన అన్నారు. మోడీకి, తనకూ అనుభవం ఉందని, కలిసి వెళ్తే కాంగ్రెసును ఓడించి, దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దామని అనుకున్నానని, మోడీతో మాట్లాడానని, మోడీ న్యాయం చేయలేదని ఆయన అన్నారు. కొత్త రాజధానిని తామే ఏర్పాటు చేసుకుంటామని ఆయన అన్నారు. రాజధాని పేర సీమాంధ్రలో చిచ్చు పెట్టాలని కాంగ్రెసువాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసువాళ్లు జైళ్లు కడుతారు తప్ప రాజధానులు కట్టలేరని ఆయన అన్నారు.
కష్టపడి సీమాంధ్ర నిర్మాణం చేసుకోవాలని ఆయన అన్నారు. సీమాంధ్రలో జీతాల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సీమాంధ్రను ప్రపంచపటం మీద పెడుతానని ఆయన చెప్పారు. బిజెపి పార్లమెంటులో పోరాడలేదని, సీమాంధ్రకు న్యాయం చేయలేదని చంద్రబాబు విమర్శించారు. మోడీ ఎన్నో కబుర్లు చెప్పారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో బలం ఉంటే సోనియా గాందీ రాష్ట్రాన్ని విభజించేవారా అని ఆయన అడిగారు. సీమాంధ్ర ప్రజల కోసం ఇంకా ఎక్కువగా కష్టపడుతానని, కసిగా పనిచేస్తానని, చేసి చూపిస్తామని ఆయన అన్నారు.