శివకు ఏం తక్కువ చేశా?, పార్టీ పరువు తీయొద్దు: నేతలకు బాబు వార్నింగ్
సొంత పార్టీ నేతల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత జిల్లాలో నాయకులు సఖ్యతగా లేకపోవడం సరైంది కాదని, ఇసుక, మద్యం దందాలు చే
అమరావతి: సొంత పార్టీ నేతల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత జిల్లాలో నాయకులు సఖ్యతగా లేకపోవడం సరైంది కాదని, ఇసుక, మద్యం దందాలు చేసి పార్టీ పరువు, తన ప్రతిష్ఠ దెబ్బతీయవద్దని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇసుక దందా చేస్తే ఇకపై పార్టీనుంచి బహిష్కరణ తప్పదని స్పష్టం చేశారు.
ఒళ్లు దగ్గరపెట్టుకోండి
మంగళవారం రాత్రి తన నివాసంలో జరిగిన చిత్తూరు జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో పార్టీ నాయకుల మధ్య కొనసాగుతున్న అనైక్యత, వర్గ విభేదాలు, ఇసుక దందాపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చర్యలతో పార్టీ, తన పరువు పోతోందని, ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో నాయకుల అనైక్యత వల్లే పార్టీ దెబ్బతింటోందని, ఇకపై జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఊపందుకోవాలని ఆదేశించారు.
ఏర్పేడుపై తీవ్రంగా..
ఏర్పేడులో జరిగిన వ్యవహారంపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల నుంచి ఇసుక దందాపై ఫిర్యాదులొస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. కాగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు దూకుడుతో పార్టీ నష్టపోతుందన్న సమాచారం మేరకు, ఆయనను పక్కకుపెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. చిత్తూరులో ఎమ్మెల్యే అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలని ఆదేశించారు.
శివకు ఏం తక్కువ చేశా..
ఎంపీ శివప్రసాద్ తనపై చేసిన వ్యాఖ్యలను బాబు స్వయంగా ప్రస్తావించారు. శివప్రసాద్కు నేనేం అన్యాయం చేశాను? ఎందులో తక్కువచేశాను? అతను ఆ విధంగా మాట్లాడటం కరక్టేనా? అని ప్రశ్నించినట్లు సమాచారం. వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దడం సరైంది కాదన్నారు. కాగా, సమావేశంలో పాల్గొన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు.
శివ, బొజ్జల గైర్హాజరు
కాగా చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో చంద్రబాబుపై తిరుగుబాటు చేసిన ఎంపీ శివప్రసాద్, మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గైర్హాజరయ్యారు. బొజ్జలకు ఆరోగ్యం బాగోలేనందుకే ఆయన రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే, తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై బొజ్జల ఇంకా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.