ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ: 'ఆ దళిత యువకుడిని తప్పుడు కేసులో ఇరికించారు-వారిపై చర్యలు తీసుకోండి..'
నెల్లూరు జిల్లా పైడేరు కాలువలో మట్టి మాఫియా వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్కి లేఖ రాశారు. వైసీపీ నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకే మల్లిఖార్జున్ అనే దళిత యువకుడిపై దాడి జరిగిందన్నారు. మల్లిఖార్జున్ను తప్పుడు కేసులో ఇరికించిన కొడవలూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి బాధితుల పైనే దాడి చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని... మల్లిఖార్జున్పై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని కొడవలూరు మండలం కమ్మపాలెం సమీపంలో పైడేరు ఆనకట్టలను ధ్వంసం చేసి మరీ టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకే టీడీపీకి చెందిన దళిత నేత మల్లిఖార్జున్పై బుధవారం(జూన్ 16) వైసీపీ గూండాలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. అంతేగాక,మల్లిఖార్జున్పై ఐపీసీ సెక్షన్లు 341,323,506ల కింద అక్రమ కేసులు నమోదు చేశారని అంటున్నారు.

మల్లిఖార్జున్పై దాడి చేసినవారిని వదిలిపెట్టి బాధితుడు మల్లిఖార్జున్పై కొడవలూరు ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రసన్నం చేసేందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.పైడేరులో మట్టి మాఫియా రెచ్చిపోతున్న రెవెన్యూ,పోలీస్,ఇరిగేషన్ శఆఖల అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్కు సైతం ఈ మాఫియాపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు.
ప్రసన్నకుమార్ రెడ్డికి దళితులపై ఏమాత్రం గౌరవం ఉన్నా మల్లిఖార్జున్పై దాడి చేసినవారిని అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని... లేనిపక్షంలో ఆయన దళిత ద్రోహిగా మిగిలిపోతారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గౌతమ్ సవాంగ్కి లేఖ రాసి కొడవలూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications