విజయవాడ సిపి గా ఎవరిని పెట్టాలి?... సిఎం చంద్రబాబు కసరత్తు
విజయవాడ:రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతల విషయమై అత్యంత కీలకపాత్ర పోషించే విజయవాడ పోలీస్ కమిషనర్ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
ఇదే విషయమై ఆయన ఆదివారం సీనియర్ ఐపిఎస్ అధికారులు ద్వారకాతిరుమలరావు, నళినీ ప్రభాత్, అమిత్గార్గ్లతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు వారితో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. గౌతమ్ సవాంగ్ విజిలెన్స్ డిజిగా వెళ్లిన తరువాత విజయవాడ పోలీస్ కమిషనర్ పదవీ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది.
రాజధాని ప్రాంతంలో ఎంతో కీలకమైన ఈ పదవి కోసం పలువురు సీనియర్ ఐపిఎస్లు పోటీ పడుతున్నారు. సిఐడి చీఫ్ ద్వారకాతిరుమలరావు, ఆపరేషన్స్ ఎడిజి నళినీ ప్రభాత్తో పాటు గతంలో విజయవాడ కమిషనర్గా చేసిన సీనియర్ సిఐడి అధికారి అమిత్గార్గ్ కూడా ఈ రేసులో ముందున్నట్లుగా తెలుస్తోంది. సిఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ ముగ్గురు పోలీసు అధికారులతో సమావేశమయింది కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ పదవి భర్తీ కోసమే అని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ ముగ్గురు ఐపిఎస్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ జరిగినందున ఇక అతి త్వరలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ ఎంపిక ఉంటుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.