ఓటుకు నోటులో బాబు పేరు కెసిఆర్ కుట్ర, హోదా ఇవ్వమనలేదు కానీ: పల్లె
అనంతపురం: ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తమ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరికించిందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పేరును ఏసీబీ ఛార్జీషీటులో కావాలనే ప్రస్తావించారన్నారు.
చంద్రబాబు పేరును పలుమార్లు ప్రస్తావించారన్నారు. అయితే, ఓటుకు నోటు కేసు విచారణలో కావొచ్చు, మరో కేసులో కావొచ్చు... చంద్రబాబు ఎక్కడా తప్పు చేసినట్లు నిరూపితం కాలేదని చెప్పారు. చంద్రబాబు పైన ఇప్పటి దాకా 25 కేసులు నమోదయ్యాయన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం లేదు
ప్రత్యేక హోదా అంశం పైన కూడా పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించారు. తాము ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. అయితే, ఇబ్బందులు ఉన్నాయని మాత్రమే చెప్పిందన్నారు. హంద్రీనవా మోటార్లను పట్టిసీమకు తరలించలేదని చెప్పారు.
జగన్ ఉద్యమం చేయడం కాదు..
వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడం కాదని, విభజన చట్టాన్ని అమలు చేయాలని ఉద్యమించాలని హితవు పలికారు. అనంతపురం పారిశ్రామిక హబ్గా మారుస్తామన్నారు. సోలార్ పార్క్ పరిహారంలో అక్రమాల పైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గార్లదిన్నె ఎరువుల కర్మాగారం కాలుష్యంపై విచారణ జరిపిస్తామని, తర్వాత చర్యలు ఉంటాయన్నారు.
జగన్ అడ్డుకునే ప్రయత్నం: దేవినేని
జగన్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రైతు కోసం చంద్రన్నను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు దేవినేని, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు మాట్లాడారు.
రైతులు బాగుపడటం జగన్కు ఇష్టం లేదన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టుల నిర్మాణంకు రూ.2వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. జగన్ పట్టిసీమతో పాటు అన్ని ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతుల దిగుబడి పెంచే ప్రయత్నాలు చేస్తామన్నారు. రెండేళ్లలో బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.