ఒప్పుకోవాలి, ఐటీని చంద్రబాబే తెచ్చారు కానీ: లక్ష్మీపార్వతి వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఓ టెలివిజన్ షోలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏపీకి ఐటీని తీసుకు వచ్చింది చంద్రబాబేనని ఆమె చెప్పారు. దేశంలోకి ఐటీని దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకు వస్తే, ఏపీకి చంద్రబాబు తెచ్చారన్నారు.
అయితే, చంద్రబాబు ఐటీని విస్తరించే విషయంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, వాటిని నెరవేర్చడం లేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలకు శక్తి ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యల పైన కూడా ఆమె స్పందించారు.
ఎన్టీఆర్ దేవుడేనని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే ఎన్టీఆర్ దేవుడన్న విషయం చంద్రబాబు చెబితే ఎలా అన్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచాడన్నారు. పదవి నుండి దింపిసేనందుకు చంద్రబాబు నిజంగా పశ్చాత్తాపపడితే ఆ విషయం ఒప్పుకోవాలని సవాల్ చేశారు. బాబు అవకాశవాదిలా మాట్లాడవద్దన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించుకోలేని చంద్రబాబు, ఆ సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాగా, ఎన్టీఆర్ విగ్రహానికి ఒక శక్తి ఉందని, తిరుమలలోని వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటే, ఆయన దీవిస్తే మీ కష్టాలు ఎలా తీరతాయో ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలచుకుని, ఆయన విగ్రహాన్ని ఒక్కసారి చూసుకుని ఏ సంకల్పం చేసినా, అది జయప్రదం అవుతుందని, దానికి ఢోకానే ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ఒక ఆదర్శమని, ఈ తరాలకే కాకుంమా భావి తరాలకు కూడా ఒక ఆదర్శమని, వేంకటేశ్వరస్వామి ఎలా ఉంటాడో తెలియదు కానీ, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూసుకునే సంస్కృతి వచ్చిందని, ఎన్టీఆర్ దేవుడితో సమానమని ఆయన అన్నారు. తెలుగు వారి గుండెల్లోంచి ఎన్టీఆర్ను ఎవరూ తొలగించలేరని, ఎన్టీఆర్ రికార్డును ఎన్టీఆర్ తిరిగి పుడితేనే బ్రేక్ చేయగలరని, అంతేతప్ప మరెవరూ చేయలేరని చాగల్లులో జరిగిన సభలో చెప్పారు.