వైఎస్కు ఉన్న దమ్ము బాబుకు లేదు.. జైలుకెళ్లాల్సి వస్తుందనే ఇలా!: రోజా
వైఎస్ హయాంలో ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు.. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించారని, అలాంటి దమ్ము చంద్రబాబుకు లేదన్నారు.
విజయవాడ: విశాఖ భూకబ్జాల వ్యవహారంలో సీబీఐ విచారణకు ప్రతిపక్షం వైసీపీ డిమాండ్ చేస్తోంది. తొలుత బహిరంగ విచారణ అని చెప్పి.. ఆ తర్వాత సిట్ చేత విచారణ చేపట్టడాన్ని వారు తప్పుపడుతున్నారు. సిట్ అనేది కోరలు లేని పాము లాంటిదని, సీబీఐ విచారణ జరిగితేనే నిజాలు నిగ్గు తేలుతాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.
విశాఖ భూఆక్రమణలపై గురువారం రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. భూకబ్జాల వెనుక సీఎం చంద్రబాబు హస్తముందని, దేశంలోని ఇది అతిపెద్ద భూకుంభకోణం అని ఆరోపించారు. ప్రతిపక్షాలు, మీడియా.. ఆఖరికి మిత్రపక్షం బీజేపీ సైతం సీబీఐ విచారణకు పట్టుబడుతుంటే.. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
గంటా కూడా సీబీఐ అంటుంటే!:
భూకబ్జాలకు పాల్పడిన మంత్రి గంటా సైతం సీబీఐ విచారణకు సిద్దమంటున్నారని, కానీ చంద్రబాబు,లోకేష్ ల హస్తం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే దీనికి ఒప్పుకోవడం లేదని రోజా ఆరోపించారు. హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణం విషయంలో అక్కడి టీడీపీ నేతలు సీబీఐ విచారణ కోరుతున్నారని, మరి ఇక్కడ మాత్రం టీడీపీ ఎందుకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
లోకేష్.. ఇప్పుడేమైంది?:
మాట్లాడితే తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. హుదుద్ తుఫాన్ సమయంలో రాత్రిపూట విశాఖ అంతటా తిరిగింది భూముల రికార్డులు తారుమారు చేయడానికేనని సీఎంపై ఫైర్ అయ్యారు. మహానాడులో సవాల్ విసిరిన లోకేష్ సీబీఐ విచారణపై ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చంద్రబాబు, లోకేష్ లు భూములను కబ్జా చేశారని ధ్వజమెత్తారు.
సిట్ తో ఏమి తేలదు?
విశాఖ భూఆక్రమణలపై సిట్ తో విచారణ చేపట్టడం టీడీపీ నేతలను బయటపడేసేందుకేనని ఆరోపించారు. సిట్ విచారణతో ఒరిగేదేమి లేదన్నారు. వేల ఎకరాల భూములు కబ్జా అయ్యాయని స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పినా.. సీబీఐతో కాకుండా సిట్ దర్యాప్తుతో సరిపుచ్చడం తప్పించుకోవాలని చూడటమే అన్నారు రోజా.
వైఎస్ లాంటి దమ్ము బాబుకు లేదు:
వైఎస్ హయాంలో ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు.. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించారని, అలాంటి దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. సీబీఐ విచారణ జరిగితే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందనే విషయం చంద్రబాబు, లోకేష్ లకు అర్థమైనందువల్లే వారు దానికి అంగీకరించడం లేదన్నారు.