ఇద్దరు డిప్యూటీ సీఎంల ‘పవర్’ పీకేసిన చంద్రబాబు!: కారణం ఇదేనా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం సంచలనంగా మారింది. కాగా, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఇద్దరు తెలుగుదేశం కీలక నేతలు డిప్యూటీ సీఎంలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వారిలో కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి.. డిప్యూటీ సీఎం హోదాలో రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప.. మరో డిప్యూటీ సీఎం హోదాలో హోం శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న బదిలీల్లో భాగంగా వీరిద్దరి శాఖల పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు (ఆర్డీఓ), డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్సీ) బదిలీల్లో వారు వేలు పెట్టేందుకు అవకాశం లేకుండా సీఎం చంద్రబాబునాయుడు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు కేటగిరీ పోస్టుల బదిలీలను ఇద్దరు డిప్యూటీ సీఎంల నుంచి తప్పిస్తూ... తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు తేల్చిచెప్పేసినట్లు తెలిసింది. ఈ పోస్టుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, రాజకీయ జోక్యానికి చెల్లు చీటి ఇచ్చేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
నిరుడు విశాఖపట్నం ఆర్డీఓ బదిలీ వ్యవహారం ముగ్గురు మంత్రుల మధ్య పెద్ద చిచ్చునే రేపింది. విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమదైన రీతిలో చక్రం తిప్పేందుకు యత్నించారు. ఈ వివాదం నాడు పెను కలకలమే రేపింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఈ పోస్టుల వ్యవహారంలో మరోమారు వావాదం చోటుచేసుకోకుండా ఉండేందుకే చంద్రబాబు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్ణయం తీసుకున్న మరుక్షణమే రంగంలోకి దిగిన చంద్రబాబు ఆర్డీఓ, డీఎస్పీల బదిలీలను ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 15 మంది ఆర్డీఓలను, 22 మంది డీఎస్పీలను బదిలీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.