అడ్డుపుల్లల జగన్: పవన్ భేటీలో చంద్రబాబు అప్యాయత, ఆవేదన ఇది
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయిన సందర్భంగా పలు ఆసక్తికర విషయాలకు చర్చకు వచ్చాయి. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పవన్తో చర్చించిన చంద్రబాబు.. ఏం చేద్దామన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపుల్లలు వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అడ్డుపుల్లల జగన్..
అమరావతి నిర్మాణానికి, పోలవరానికి అడ్డుపుల్లలు పెడుతున్నారని, రాజధాని నిర్మిస్తున్నది తానొక్కడినే ఉండేందుకన్నట్లు ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు.. పవన్కు వివరించారు. ఇటువంటి విపక్షం ఏ రాష్ట్రంలోనూ లేదని పవన్ వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారు చంద్రబాబు. సోమవారం సుమారు గంటపాటు ఏకాంతంగా భేటీ అయిన పవన్, చంద్రబాబు పలు అంశాలపై లోతుగా చర్చించారు. కాపులకు రిజర్వేషన్ నుంచి నంద్యాల ఉప ఎన్నికల వరకూ పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
Recommended Video
అప్యాయంగా స్వాగతం
సచివాలయాన్ని నిర్మించిన తర్వాత తొలిసారి అమరావతికి వచ్చిన పవన్ కళ్యాణ్కు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు చంద్రబాబు. అంతేగాక, అప్యాయంగా అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. హార్వార్డ్ ప్రొఫెసర్లు రావడానికి సమయం పడుతుందని తెలుసుకున్న చంద్రబాబు.. పవన్ను తన కార్యాలయానికి తీసుకెళ్లారు.
చంద్రబాబు ఆవేదన..
కాపుల రిజర్వేషన్లపై ముద్రగడ వైఖరి, గతంలో కాంగ్రెస్ పాలనలో సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. కొత్త రాష్ట్రాన్ని సగర్వంగా నిలిపేందుకు తాను అనునిత్యమూ కష్టపడుతుంటే.. విపక్షాలు తనపై కక్షతో అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అన్నీ ఇన్నీకావు..
ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తేవాలని భావిస్తే.. వద్దని లేఖలు పంపారని, తమపై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా అభివద్ధికి అడ్డుపడటం ఏంటని పవన్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. పోలవరం పూర్తయ్యేలోపే నీరివ్వాలనే ఉద్దేశంతో పట్టిసీమను తలపెడితే, అది రాకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని వివరించారు.