చంద్రబాబు - పవన్ భేటీ : పొత్తులపై క్లారిటీ -బీజేపీ మిత్రపక్షం: అది వైసీపీ కుట్ర..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు - పవన్ రాజకీయ యుద్దానికి సిద్దమయ్యారు. ఇద్దరి నేతల మధ్య సుదీర్ఘంగా భేటీ జరిగింది. జీవో నెంబర్ 1 కు వ్యతిరేకంగా పోరాటానికి నిర్ణయించారు. కలిసి కట్టుగా పని చేస్తామని ప్రకటించారు. కందుకూరు - గుంటూరు సభల్లో జరిగిన ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములని విమర్శించారు. బీజేపీ తమకు మిత్రపక్షమని.. ఈ పోరాటం పైన బీజేపీతోనూ చర్చిస్తామని పవన్ చెప్పారు. బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీని పవన్ స్వాగతించారు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చన్నారు. పొత్తుల వార్తలను ఖండించని పవన్.. భవిష్యత్ లో అన్ని అంశాల పైన మాట్లాడుతామని పరోక్షంగా తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేసారు.

కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయం..
చంద్రబాబు - పవన్ కల్యాణ్ సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగింది. వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. తాను కుప్పంలో జరిగిన పరిణామాలతో చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చానని పవన్ వెల్లడించారు. వైజాగ్ తో తన పర్యటన సమయంలో ప్రారంభమైన ఈ పరిణామాలు కుప్పం వరకు కొనసాగాయన్నారు. చెల్లుబాటు కాని జీవోలతో ప్రతిపక్షాలను అడ్డుకొనే ప్రయత్నం చేసారని ఆరోపించారు. కందుకూరు..గుంటూరు సభల్లో తొక్కిసలాట వెనుక వైసీపీ కుట్ర ఉందన్నారు. సభలు జరిగే సమయంలో పోలీసుల బందోబస్తు బాధ్యతని.. కానీ, పోలీసులను ఇవ్వకపోవటం తో తాము లాఠీలను పట్టుకొని లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామా అని పవన్ - చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధానంగా జీవో నెంబర్ 1 ను వెనక్కు తీసుకొనేలా పోరాటం చేయటం పైనే చర్చించామని చెప్పుకొచ్చారు.

వైసీపీ విశ్వరూపం చూపిస్తుంది..
వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ విశ్వరూపం చూపిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. తాను వారాహి రుణం తీసుకొని కొనుగోలు చేస్తే కూడా రాద్దాంతం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేయాలో వైసీపీ అన్నీ చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకూడదని చెత్త జీవోలతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కోనసీమలో జరిగిన అల్లర్లను పవన్ ప్రస్తావించారు. వైసీపీ నేతలు వారికే వారే విధ్వంసాలు చేసి ప్రత్యర్ధులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్ల వైసీపీ ఓడిపోతుందని తెలిసే ఈ రకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయని..ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. బీజేపీతో సహా అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామని పవన్ స్పష్టం చేసారు. బీజేపీ తమ మిత్రపక్షమని పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పొత్తుల పైన ప్రశ్నించిన సమయంలో అవసరమైన సమయంలో ఆ చర్చ ఉంటుందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాల పైనే చర్చించామని చెప్పిన పవన్ పొత్తు ప్రస్తావనను ఖండించలేదు.

పొత్తులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదు
చంద్రబాబు - పవన్ సుదీర్ఘ మంతనాల తరువాత పొత్తుల పైన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. పొత్తుల పైన ఇప్పుడే మాట్లాడటం సరి కాదని చెప్పారు.ఎన్నికలప్పుడే పొత్తులు ఉంటాయని..తమ వ్యూహాలు తమకు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ తమ లక్ష్యమని చెప్పారు. అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సమయం వచ్చాక అందరితో చర్చిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కందుకూరులో పోలీసులు లేక తొక్కిసాట జరిగిందని.. ఆ తరువాత సభల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. ముఖ్యమంత్రి పరదా చాటున పర్యటనలు చేస్తున్నారని.. వైసీపీ నేతలకు జీవోలు వర్తించవా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications