కాకినాడలో కీలక ప్రాజెక్ట్..! చంద్రబాబు, పవన్ శంఖుస్దాపన..!
ఏపీలోని కాకినాడలో ఇవాళ కాకినాడ-ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ కు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా శంఖుస్ధాపన చేశారు. ఈ ఉదయం కాకినాడ చేరుకున్న వీరిద్దరూ నగరంలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించనున్న ప్లాంట్ నమూనాను పరిశీలించారు. అనంతరం ఏఎం గ్రీన్ సంస్థ యంత్రపరికరాల బిగింపు పైలాన్ ను కూడా ఆవిష్కరించారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా స్వగ్రామాన్ని మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకుంటూనే, టెక్నాలజీని వాడుకోవాలన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ఇది అన్నారు. 2027 జూన్ నాటికి తొలిదశ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. చరిత్రను తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ చొరవతో నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ వచ్చిందని, బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది, కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెనుమార్పులు వస్తున్నాయని తెలిపారు. కాబట్టి గ్రీన్ అమ్మోనియాతో భవిష్యత్తులో పెనుమార్పుకు నాంది పలుకుతున్నట్లు బాబు వెల్లడించారు.

మరోవైపు బలమైన సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. చలమలశెట్టి అనిల్, మహేష్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని 'AM గ్రీన్' కంపెనీ పెట్టారన్నారు. 'AM గ్రీన్' కంపెనీ 495 ఎకరాల్లో ఏర్పాటుకానుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకమని, క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి అన్నారు.












Click it and Unblock the Notifications