ఐవిఆర్ఎస్తో అభ్యర్థి: దేశంలో బాబు వినూత్నప్రయోగం!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తమ పార్టీ తరఫున సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఫోన్ల ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన 8.5 కోట్ల నెంబర్ల డేటాను ఆ పార్టీ సేకరించింది.
మొదటి దశలో ఆరు లక్షల మంది టిడిపి కార్యకర్తలను ఫోన్ ద్వారా సంప్రదించి వారి నియోజకవర్గంలో ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు సరైన వారన్నదానిపై అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ వడపోత తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. దీనికి ఐవిఆర్ఎస్ విధానాన్ని ఎంచుకొన్నారు. దీని ప్రకారం వివిధ నియోజకవర్గాల్లోని ప్రజలకు ఆ పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ వస్తుంది.
అక్కడ టిడిపి తరఫున ప్రతిపాదనల్లో ఉన్న ఇద్దరు లేక ముగ్గురు అభ్యర్థుల పేర్లను వారికి వినిపిస్తారు. అందులో నచ్చిన వారి నెంబర్ను నొక్కాలి. ఎవరూ నచ్చకపోతే దానికి కేటాయించిన నెంబర్ను కూడా నొక్కవచ్చు. దీనితో పాటు తమ అభిప్రాయం చెప్పడానికి కూడా అందులో అవకాశం ఉంటుంది. ఆ అభిప్రాయం రికార్డ్ అయ్యి కంఫ్యూటర్లోకి వెళ్తుంది. అంతిమంగా వీటన్నింటినీ విశ్లేషించి అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకొంటారు.
ఈ విధానంలో భాగంగా తన నియోజకవర్గమైన కుప్పంలో తనపై కూడా అభిప్రాయ సేకరణ చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. తనతో సహా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. పాతవారు అందరూ ఈ విధానానికి లోబడి ఉండాల్సిందే అన్నారు. ఎవరి విషయంలో అయినా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైతే వారి సేవలను పార్టీ మరో విధంగా ఉపయోగించుకుంటుందన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే తాము వెళ్తామని, ఇది దేశంలోనే వినూత్న ప్రయోగమన్నారు.
ఏ రాజకీయ పార్టీ ఇటువంటి ప్రయోగం చేయలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం అమెరికాలో ప్రైమరీలు జరుగుతుంటాయని, మనం టెక్నాలజీని ఉపయోగించుకొంటున్నామన్నారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన సమాచారం కేవలం తన వద్దకే చేరుతుందని, దీనిని అందరికీ ఇవ్వలేమని చెప్పారు. కొద్ది రోజుల్లో దీనిని చేపడతామని ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందువల్ల అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోందన్నారు.
ఒక వారం వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. టిడిపిని కాంగ్రెస్ వారితో నింపుతున్నారన్న విమర్శపై ప్రశ్నించినప్పుడు.. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడు మాదిరిగా తయారైందని, దీంతో ఆ పార్టీ నేతలంతా బయటకు వెళ్లిపోతున్నారని, వారికి ఒక వేదిక కావాలని, అనేక మంది తమ వద్దకు వస్తున్నారని, తమకు ఉపయోగపడతారని అనుకొన్నవాళ్లనే తీసుకుంటున్నామని, అదే సమయంలో మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను విస్మరించేది లేదన్నారు.