బాబు ప్లాన్ రివర్స్: జగన్ పార్టీని ఖతం చేసినా పవన్ కల్యాణ్తో తప్పదా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జాతకం బాగా లేనట్లుంది. ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి ఆయన ప్లాన్ చేసి అమలు చేస్తుంటే మరో సమస్య తలెత్తుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా చూసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు.
వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మెజారిటీ శాసనసభ్యులను, నాయకులకు తమ పార్టీలో చేర్చుకుంటే ప్రతిపక్షమనేదే ఉండదని చంద్రబాబు భావించారు. కాంగ్రెసు పార్టీ పుంజుకునే అవకాశాలు లేవు. దీంతో రాష్ట్రంలో 2019 ఎన్నికలను ఏకపక్షంగా గెలుచుకోవచ్చునని ఆయన భావించారు.

అయితే, చంద్రబాబు ఆశలు కల్లలయ్యే పరిస్థితిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కల్పించారు. జగన్ పార్టీని తుదముట్టించినా ఆయన పవన్ కల్యాణ్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదు. అంతేకాదు, బిజెపితో తెగదెంపులు చేసుకుంటే మరో ప్రమాదం చంద్రబాబుకు ఎదురయ్యే అవకాశం ఉంది. జగన్తో బిజెపి జత కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలుచుకోవడానికి బిజెపి జగన్తో జత కట్టినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెసు నుంచి బిజెపిలో చేరిన సీనియర్ నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మినారాయణ వంటివారిని బిజెపి తరఫున పార్లమెంటుకు పోటి చేయించి, ఎక్కువ శాసనసభా స్థానాలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తే బిజెపికి కేంద్రంలో తగిన పార్లమెంటు సభ్యుల బలం ఎపి నుంచి వస్తుంది, రాష్ట్రంలో జగన్కు అధికారం దక్కే అవకాశాలుంటాయనేది అంచనా.
పవన్ కల్యాణ్ ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించారు కాబట్టి బిజెపి జగన్తో జత కట్టడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండకపోవచ్చు. క్రమంగా జగన్ అక్రమాస్తుల కేసు కూడా వీగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి జగన్కు క్లీన్ చిట్ లభిస్తే, ఆయనతో బిజెపి జత కట్టడానికి ఏ విధమైన ఆటంకాలూ ఉండవు, విమర్శలు వచ్చే అవకాశం కూడా లేదు.












Click it and Unblock the Notifications