బాబు ప్లాన్: చికాగో తరహా రాజధాని, వ్యూలో 'ఎన్టీఆర్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చికాగో తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజధానిని చికాగో తరహాలో నిర్మించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అమెరికా ప్రతినిధులు కొందరు ఇటీవల చంద్రబాబుకు ప్రతిపాదనలు సూచించిట్లుగా సమాచారం. ఏరియల్ వ్యూలో ఎన్టీఆర్ పేరు వచ్చేలా భవనాల ప్రతిపాదన చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో భవనం 45 అంతస్తుల ఎత్తు, భిన్నకోణాల్లో ఉండేలా చూస్తున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా స్వాగతించింది.
మరోవైపు కొత్త రాజధానికి పేరు పెట్టే విషయమై చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ పేరు పెట్టాలని పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలు సూచిస్తున్నారు. రాజధానికి కాకపోయినా అధికార భవంతులకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని చాలామంది భావిస్తున్నారు. ఎన్టీఆర్ నగర్, తారకరామ నగర్ వంటి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.